మండలి రద్దు బిల్లుపై కేంద్రం సస్పెన్స్: రెండో విడత బడ్జెట్ సమావేశాలపై వైసీపీ ఆశలు!!
ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపి కేంద్రం ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ఇక త్వరలో కొనసాగనున్న రెండో విడత పార్లమెంట్ సమావేశాల్లో మండలి రద్దు అంశంపై ఆమోదం తెలపాలని ఇటీవల సీఎం జగన్ అటు ప్రధాని మోడీని , హోం శాఖా మంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే . అయినప్పటికీ రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మండలి రద్దుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే .తాజా పరిణామాలు కేంద్రం మండలి రద్దుపై నాన్చివేత ధోరణి అవలంబించే అవకాశం ఉందేమో అన్న అనుమానాలకు కారణం అవుతుంది.
రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో మండలి రద్దు ప్రస్తావన డౌటే
మండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపిన ఏపీ సర్కార్ కేంద్రం నుండి ఆమోద ముద్ర కోసం వేచి చూస్తుంది. మొదటి విడత బడ్జెట్ సమావేశాల్లో మండలి రద్దు ప్రస్తావన రాలేదు. ఇక ఇప్పుడు రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో మండలి రద్దు ప్రస్తావన డౌటే అని తెలుస్తుంది. మార్చి 3 నుంచి జరిగే రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పెట్టే బిల్లులు, ఇతర అంశాలపై చర్చించేందుకు నిన్న ఢిల్లీలో అధికారుల స్థాయిలో కీలక సమావేశం జరిగింది.
లిస్ట్ ఆఫ్ బిజినెస్పై సుదీర్ఘ చర్చ..ఏపీ మండలి రద్దు బిల్లు ఊసే లేదు
అయితే ఈ సమావేశంలో ఉభయసభల్లో పెట్టే లిస్ట్ ఆఫ్ బిజినెస్పై సుదీర్ఘంగా చర్చించారు. కానీ ఈ మీటింగ్లో ఏపీ శాసన మండలి రద్దు అంశం చర్చకు రాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం .ఇక ఢిల్లీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే.. వచ్చే పార్లమెంట్ సెషన్లో ఏపీ మండలి రద్దు బిల్లు పెట్టే అవకాశం లేదు అనే భావన కలుగుతుంది. కానీ వైసీపీ మాత్రం ఈ సారి జరగనున్న రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో కచ్చితంగా మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదింపజెయ్యాలని నానా తంటాలు పడుతుంది.
మండలి రద్దు ఓకే అయితేనే మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం
3 రాజధానుల బిల్లును మండలి సెలక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో మండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసలు మండలే లేకపోతే తమ మూడు రాజధానుల నిర్ణయం తక్షణం అమలు చెయ్యవచ్చు అని భావిస్తుంది వైసీపీ సర్కార్ . ఈ పరిస్థితుల్లో మండలి రద్దు బిల్లు కేంద్రం వద్ద పెండింగ్లో పడితే అది వైసీపీ సర్కార్ కు ఒకింత ఇబ్బందికర పరిణామమే . వైసీపీ నేతలు కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవటం కోసం రాజ్యసభలో కేంద్రానికి సహకరిస్తామని చెప్పినా,ఎన్ని విజ్ఞప్తులు చేసినా ,హామీలు ఇచ్చినా మండలి రద్దు బిల్లుపై కేంద్రం ఆచి తూచి వ్యవహరించనుంది.
Recommended Video
సప్లిమెంటరీ అజెండాగానో, టేబుల్ ఐటమ్గానో పెట్టే అవకాశం..కేంద్ర నిర్ణయంపై సస్పెన్స్
ప్రస్తుతం ఖరారైన లిస్ట్ ఆఫ్ బిజినెస్లో మండలి రద్దు బిల్లు లేకపోయినా కావాలనుకుంటే సప్లిమెంటరీ అజెండాగానో, టేబుల్ ఐటమ్గానో దీన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దానిపైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం కేంద్రం వద్ద వివిధ రాష్ట్రాల నుంచి మండలి రద్దు తీర్మానాలు, మండలి ఏర్పాటు కోరుతూ చేసిన తీర్మానాలు పెండింగ్లో ఉన్న నేపధ్యంలో కేంద్రం తీసుకునే ఏ నిర్ణయం అయినా అన్ని రాష్ట్రాల అభ్యర్థనల మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇక ఈ నేపధ్యంలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా లేదా అన్నది మరి కొద్ది రోజుల్లో జరగనున్న రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో తేలనుంది.