సెలెక్ట్ కమిటీల ఏర్పాటు..9 మంది సభ్యులు: మంత్రి అధ్యక్షతన: మూడు నెలల సమయం..!
సెలెక్ట్ కమటీల ఏర్పాటులో తొలి అడుగు పడింది. మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. ఆ వెంటనే మండలి వాయిదా పడింది. ఇప్పటి వరకు కమిటీ ఏర్పాటు జరగలేదు. దీంతో..మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు పైన అధికారులతో చర్చించారు. రెండు బిల్లులకు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఒక్కో కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారు. కమిటీ ఛైర్మన్ గా బిల్లు ప్రతిపాదించిన మంత్రి వ్యవహరిస్తున్నారు. కమిటీలో సభ్యులుగా నియమించేందుకు సభ్యుల పేర్లు ప్రతిపాదించాలని ఛైర్మన్ పార్టీలకు లేఖలు రాసారు. ఈ పేర్లు వచ్చిన తరువాత అధికారికంగా కమిటీలు ఏర్పాటు చేస్తారు. కనీస వ్యవధి మూడు నెలలుగా నిర్ణయించి..కమిటీ ఆ దిశగా నివేదిక ఇచ్చేందుకు పని చేయాల్సి ఉంటుంది.
సభ్యుల పేర్లు ఇవ్వండి...
మండలిలో ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్ షరీఫ్ ఈ నెల 22న రూలింగ్ ఇచ్చారు. ఆ నిర్ణయం పెద్ద ఎత్తున వివాదాస్పదం అయింది. అయితే, ఛైర్మన్ తన నిర్నయానికి అనుగుణంగా కమటీల ఏర్పాటు పైన అధికారులతో చర్చించారు. రెండు బిల్లులకు రెండు కమిటీలు నియమించనున్నారు. అందు కోసం ఒక్కో కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారు. దీని కోసం పార్టీల నుండి సభ్యులుగా నియమించటానికి పేర్లు ఇవ్వాలని కోరుతూ ఛైర్మన్ పార్టీలకు లేఖలు రాసారు.
ఈ కమిటీల్లో టీడీపీ సభలో మెజార్టీ ఉండటంతో..ఆ పార్టీ నుండి అయిదుగురు..వైసీపీ..బీజేపీ..పీడీఎఫ్ నుండి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారు. మూడు రాజధానుల బిల్లు కమిటీకి ఆర్దిక మంత్రి బుగ్గన.. సీఆర్డీఏ రద్దు బిల్లుకు మున్సిపల్ మంత్రి బొత్సా ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరికి తొలుత మూడు నెలల సమయం కేటాయిస్తారు. అసవరమైతే కమిటీ అభ్యర్ధన మేరకు సమయం పొడిగించే అవకాశం ఛైర్మన్ కు ఉంటుంది.
కమిటీ ఏం చేస్తుంది...
ఈ కమిటీలో సభ్యుల నియమకం పూర్తయినా..తరువాత కమిటీ విధి విధానాలతో ఛైర్మన్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. బిల్లులను ఈ రెండు కమిటీలు ముందుగా చర్చిస్తాయి. ఆ తరువాత 13 జిల్లాల్లోనూ పర్యటించి ప్రజాభిప్రాయం సేకరిస్తారు. అసవరమైతే ఉద్యోగ..విద్యార్ది..ప్రజా సంఘాల అభిప్రాయాలను సైతం సేకరించే అధికారం కమిటీలకు ఉంటుంది. బిల్లులో ఉన్న అంశాల పైన మాత్రమే కమిటీ ప్రజాభిప్రాయం సేకరించాల్సి ఉంటుంది. అయితే, బిల్లులో స్వరూపం మార్చటం..బిల్లు ఉద్దేశాలకు భిన్నంగా అభిప్రాయాలు సేకరించే అధికారం ఉండదు.
కమిటీ అధ్యయనం చేస్తున్న సమయంలో వారికి అధికార యంత్రాంగం సమకారం అందిచాల్సి ఉంటుంది. ఇక, కమిటీ మెజార్టీ సభ్యులు తమకు నివేదిక సమర్పించేందుకు మరింత సమయం అవసరమని భావిస్తే ..ఛైర్మన్ అందుకు అంగీకరిస్తే సమయం పెంచే అవకాశం ఉంటుంది. చివరగా..కమిటీ తమ నివేదికను తిరిగి ఛైర్మన్ కు సమర్పిస్తారు. దాని పైన సభలో చర్చించి..అసెంబ్లీకి పంపుతారు. అసెంబ్లీ మండలి నుండి వచ్చిన సవరణలను ఆమోదించినా.. తిరస్కరించినా బిల్లు ఆమోదం పొందటం లాంఛమనే. దీంతో..ఒకటి రెండో రోజుల్లోనే సెలెక్ట్ కమిటీలు పని చేయటం ప్రారంభించే అవకాశం ఉంది.