మండలిలో బిల్లుకు తాత్కాలిక బ్రేక్: టీడీపీ తీర్మానంపై చర్చ: మంత్రుల అభ్యంతరం..వాయిదా..!
ఏపీ శాసనసమండలి సమావేశాలు అంచనాలకు భిన్నంగా వేడి పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం శాసనసభలో ఆమోదం పొందిన మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టేందుకు సిద్దం అవుతున్న సమయంలో టీడీపీ ట్విస్ట్ ఇచ్చింది. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందేనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మండలి ఛైర్మన్ ... రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో..పార్టీ ఎమ్మెల్సీతో ఫ్లోర్ లీడర్ యనమల సమావేశమయ్యారు. కానీ, మంత్రులు మాత్రం మండలి ఛైర్మన్ తీరు పైన మండిపడుతున్నారు. సభలో గందరగోళం నడుమ ఛైర్మన్ సభను వాయిదా వేసారు.
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, అవకాశం కల్పించిన సీఎం జగన్కు థాంక్స్: తమ్మినేని
మండలిలో బిల్లు మరింత ఆలస్యం..
ఏపీ శాసన మండలిలో ఎత్తులు..పై ఎత్తులతో రాజకీయం రంజుగా మారింది. ప్రభుత్వ రెండు బిల్లులను మండలిలో ప్రతిపాదించేందుకు సిద్దం అయింది. ఆ సమయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ అనూహ్యంగా తెర మీదకు రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. శాసనమండలిని కించపరిచే విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన యనమల.. మండలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి సభ్యులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి మంత్రి బుగ్గన అభ్యంతర వ్యక్తం చేసారు. ప్రభుత్వ బిజినెస్ కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రూల్స్ చెబుతున్నాయని వాదించారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని పేర్కొన్నారు. ఛైర్మన్ పని తీరు మచ్చగా మిగిలిపోతుందని మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయవద్దంటూ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన ఛైర్మన్ తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని స్పష్టం చేసారు.
చర్చకు అనుమతించిన ఛైర్మన్
సభలో అధికార..విపక్షాల మధ్య వాదోపవాదల సమయంలోనే మండలి ఛైర్మన్ రూలింగ్ ఇచ్చారు. రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు సెక్షన్ 71 కింద మండలికి ఉందని యనమల గట్టిగా వాదించారు. మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించడానికి ఈ నిబంధనను వినియోగించుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వం పెట్టిన రెండు బిల్లుల్లోని సారాంశాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చారు. సెక్షన్ 71 కింద తీర్మానం ద్వారా మా వ్యతిరేకతను అధికారికంగా వ్యక్తం చేస్తున్నామని..బయట జరుగుతోన్న ప్రజాందో ళనలకు మద్దతుగానే మేం ఈ నిర్ణయం తీసుకున్నామని యనమల స్పష్టం చేసారు. టీడీపీ ఇచ్చిన తీర్మానం పైన చర్చకు రెండు గంటల సమయం ఇస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు. దీనిని తిరిగి సమీక్షించాలని మంత్రులు పట్టుబడుతున్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ తీరు పట్ల షేమ్ షేమ్ అంటూ నినాదాలు సాగిస్తున్నారు. దీంతో..వాగ్వాదం నడుమ సభను మండలి ఛైర్మన్ వాయిదా వేసారు.
మంత్రుల అభ్యంతరం..బిల్లుకు తాత్కాలిక బ్రేక్..!
టీడీపీ తీర్మానం పైన చర్చకు మండలి ఛైర్మన్ అనుమతి ఇవ్వటం పైన మంత్రులు అభ్యంతర వ్యక్తం చేసారు. ఇది సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉందని వాదిస్తున్నారు. రూల్ 71 ద్వారా ప్రభుత్వ బిజినెస్ ను చర్చించక పోతో భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు వస్తాయని ఆర్దిక మంత్రి బుగ్గన అభ్యంతరం వ్యక్తం చేసారు. దీంతో..ఇంకా టీడీపీ తీర్మానం పైన చర్చ ప్రారంభం కాలేదు. దీని పైనే ఇంకా అధికార..విపక్ష సభ్యు ల మధ్య వాదోపవాదనలు సాగుతున్నాయి. ఇక, ప్రభుత్వం సభ ప్రారంభం కాగానే 11 గంటలకు బిల్లులు ప్రవేశ పెట్టాలని భావించింది. కానీ, మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.మండలిలో బిల్లు పెట్టి వీగిపోతే డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద ప్రభుత్వానికి ఆమోదం చేసుకునే అవకాశం ఉంటుంది.అసలు బిల్లే పెట్టకపోతేడీమ్డ్ టు బీపాస్డ్ కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో..ఈ తీర్మానం పైన చర్చ తరువాత బిల్లులు ప్రవేశ పెడతారా..లేక ఈ లోగా మరేదైనా ట్విస్ట్ సభలో చోటు చేసుకుంటుందా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.