మండలి కాదు ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేయి..వంగవీటి సవాల్, పిరికిపంద చర్య అంటూ కేశినేని
శాసనమండలి రద్దుపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. మండలి రద్దు తీర్మానాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రవేశపెట్టారు. ఏపీ కేబినెట్ సమావేశం లో మండలి రద్దుకు కేబినెట్ ఆమోదించింది. అనంతరం బీఏసీ సమావేశం జరిగింది. రద్దు తీర్మానంపై చర్చించాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో జగన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై టీడీపీ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం అందరికీ తెలుస్తుందన్న వంగవీటి రాధాకృష్ణ
జగన్కు ధైర్యం ఉంటే అసెంబ్లీని కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రివర్స్ టెండరింగ్ అంటూ రాజధానినే రివర్స్ చేశారని ఎద్దేవా చేసిన ఆయన రాజన్న రాజ్యం అంటూ అమరావతిలో రైతుల మరణానికి కారణమయ్యారని మండిపడ్డారు . ఎన్నికలకు వెళితే ప్రజలు కూడా రివర్స్ ఓటు వేసి బుద్ధి చెబుతారని హెచ్చరించారు . రాజధాని ఉద్యమానికి పార్టీ, కులం రంగు వేయవద్దని వంగవీటి రాధా మండిపడ్డారు.
ఇంత పిరికివాడని అనుకోలేదని కేశినేని ట్వీట్
ఇక టీడీపీ ఎంపీ కేశినేని నానీ కూడా జగన్ తీసుకున్న మండలి రద్దు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనమండలి రద్దు చేస్తామని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపి కేశినేని నాని ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిందని , 28 మంది ఎమ్మెల్సీల దెబ్బకు భయపడి పారిపోవటానికి కాదని అన్నారు. సీఎం జగన్ ధైర్యంగా నిలబడి దమ్ముగా పోరాడతారని అనుకున్నారని అయన వ్యాఖ్యానించారు. కానీ ఇంత పిరికివాడని అనుకోలేదని కేశినేని నాని ట్వీట్ చేశారు.
శాసనమండలి రద్దు వైసీపీకే నష్టమన్న కేఈ ప్రభాకర్
ఏపీ శాసనమండలి రద్దుపై స్పందించిన కేఈ ప్రభాకర్ మండలి రద్దుపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం స్పందిస్తుందని కేఈ ప్రభాకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక శాసనమండలి రద్దు వల్ల వైసీపీకే నష్టమని కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు .ఇక టీడీపీ నేతలే కాదు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నాయి.