మండలి విజయం .. అది చంద్రబాబు అనుభవం .. అర్ధమైందా : నారా లోకేష్
మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య వార్ కొనసాగింది .ఏపీ శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు , సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి శాసనమండలిలోనూ బిల్స్ పాస్ చేయించాలని ప్రయత్నం చేసిన ఏపీ ప్రభుత్వానికి టీడీపీ షాక్ ఇచ్చింది. చాలా ఉద్రిక్త పరిణామాల మధ్య వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి టీడీపీ పై చెయ్యి సాధించింది .ఇక మండలిలో టీడీపీ సాధించిన విజయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు . జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు అనుభవం ఏంటో అధికార పక్షానికి తెలిసొచ్చిందన్న లోకేష్
ప్రజాస్వామ్య శక్తి ఎంతటిదో తెలిసిందా అని ప్రశ్నించారు నారా లోకేష్ . చంద్రబాబు అనుభవం ఏంటో అధికార పక్షానికి తెలిసొచ్చిందని ఆయన పేర్కొన్నారు . మండలిలో వికేంద్రీకరణ బిల్లును, టీడీపీ విజయవంతంగా సెలెక్ట్ కమిటీ బాట పట్టించగలిగిందన్నారు నారా లోకేష్ . ఇది రాజధాని రైతుల ఆకాంక్ష అంటూ లోకేష్ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రతి సారి చంద్రబాబు సీనియర్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేసే వైసీపీ నేతలకు ఆ అనుభవం ఎలా ఉందో ఇప్పుడు అర్ధమై ఉంటుందని కౌంటర్ వేశారు లోకేష్ .
మండలి విజయంతో టీడీపీ నేతలపై రాజధాని ప్రజల హర్షాతిరేకాలు
ఇక వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంపై అమరావతి ప్రాంత రైతులు సంతోషంలో ఉన్నారు. ఇక టీడీపీ శ్రేణులు సైతం వైసీపీ ప్రభుత్వంపై తాము సాధించిన ఈ విజయానికి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులో సవరణలు సూచించి , బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన నేపధ్యంలో చంద్రబాబు బయటకు రాగానే పూలవర్షం కురిపించారు రాజధాని ప్రాంత ప్రజలు . ఆయనకు శాలువాలు కప్పుతూ అభినందించి తమ పక్షాన పోరాడినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు వెంట ర్యాలీ నిర్వహించారు .
లోకేష్ పుట్టిన రోజున రైతుల కళ్ళలో ఆనందం నింపారని కితాబు
నారా లోకేష్, ఎమ్మెల్యే బాలకృష్ణను కార్యకర్తలు అభినందలతో ముంచెత్తారు. నినాదాలు చేశారు. అటు రాజధాని ప్రాంతంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున టపాసుల్ని కాల్చారు. ఇక నేడు లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా లోకేష్ ను పొగుడుతూ చాలా మంది లోకేష్ కు శుభాకాంక్షలు చెప్తున్నారు. రాజధాని ప్రాంత రైతుల కళ్ళలో సంతోషం నింపారని నవ్విన నాప చేను పండిన చందంగా నిన్న మండలిలో పాదరక్షతో కొట్టినట్టు సమాధానం చెప్పారని కితాబిస్తున్నారు.