బార్లకు కౌంట్డౌన్... జనవరి నుండి తగ్గింపు... సీఎం జగన్ ఆదేశం
ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మద్యం షాపుల నిర్వాహణకు పలు నిబంధనలు విధించిన ప్రభుత్వం తాజాగా బార్ అండ్ రెస్టారెంట్లపై దృష్టి సారించింది. నూతన సంవత్సరం నుండి బార్లను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపోందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బార్ల సమయాన్ని కూడ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం పది గంటల నుండి రాత్రి 10 గంటల వరకే బార్లు నిర్వహించాలని చెప్పారు.
మద్య విధానంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్ణయించిన సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సంధర్భంగా ఏపీలో ప్రస్తుతం కొనసాగిస్తున్న బార్ల నిర్వాహణలో మార్పులు తేవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ముఖ్యంగా బార్ల సఖ్యను తగ్గించేందుకు కసరత్తు చేయాలని ఆదేశించారు.
ఇక కొత్త బార్లు ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. అధికారులు అనుమతులు ఇచ్చే ప్రదేశాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కాగా ఇప్పటి వరకు రాత్రీ 11 గంటల వరకు కొనసాగుతున్న బార్లను రాత్రీ 10 గంటలకే వరకే కొనసాగించే విధంగా విధానాలు రూపోందించాలని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంపూర్ణ మద్యం నిషేధంపై దృష్టి సారించారు. దీంతో కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చారు. దీంతో మద్యం దుకాణాలు తగ్గించడంతోపాటు ప్రైవేటు వ్యక్తులు నిర్వహించకుండా ప్రభుత్వమే వాటిని కొనసాగిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బార్ల సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం కొనసాగిస్తున్న 840 బార్ల స్థానంలో 588 బార్లకే అనుమతి ఇవ్వనున్నారు. దీంతో బార్ల లైసెన్సులను రద్దు చేసి కొత్త లైసెన్సులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేసి నూతన సంవత్సరం నుండి మార్పులు తీసుకురానున్నారు. మరోవైపు అయిదేళ్లలో పూర్తి మద్య నిషేధాన్ని విధించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం మద్యం షాపులను సైతం తగ్గించింది. ఇలా ప్రతి సంవత్సరం షాపులను తగ్గిస్తూ పూర్తి నిషేధం వైపు అడుగులు వేస్తుంది.