పంచ్ డైలాగ్లు: కల్వకుంట్ల కవిత వర్సెస్ మధు యాష్కీ
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత పోటీకి దిగడంతో నిజామాబాద్ లోకసభ స్థానంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెసు అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ ఆషామాషీ నేత కారు. ఆయనను కవిత సవాల్ చేయడం వల్ల కూడా ఈ స్థానంపై అందరి దృష్టీ పండిది.
కవిత, మధు యాష్కీ ఎన్నికల ప్రచారంలో పరస్పరం పంచ్ డైలాగులు విసురుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలుగుదేశం మద్దతుతో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ కూడా రంగంలో ఉన్నారు. కవితపైన కన్నా మధు యాష్కీ కెసిఆర్పై తన వాగ్బాణాలు విసురుతున్నారు. తెలంగాణ తన జాగీరు అని కెసిఆర్ అనుకుంటున్నారని, దానివల్లనే కుటుంబ సభ్యులను పోటీకి దించారని మధు యాష్కీ ధ్వజమెత్తుతున్నారు.
ఫ్యూడల్ బుద్ధితో కెసిఆర్ ఎస్సీ, ఎస్టీ, బిసీలను కెసిఆర్ అణచేస్తున్నారని ఆయన దుయ్యబడుతున్నారు. తెలంగాణకు దళిత నేతను తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కెసిఆర్ దాన్ని విస్మరించి ఇప్పుడు తానే ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నారని అంటున్నారు. కెసిఆర్ మాట మీద నిలబడే నేత కారని ఆయన దుయ్యబడుతున్నారు. తెలంగాణ కోసం తాను చేసిన పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని తనను తెలంగాణ జాతి రత్నంగా కెసిఆర్ అభివర్ణించారని, ఇప్పుడు తనపై తన కూతురిని ఎందుకు పోటీకి దించారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తన పాత్ర ఏమిటో తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ లోకసభ ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు.
మధు యాష్కీ సంకుచితంగా వ్యవహరిస్తున్నారని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాడనికి బిసీ కార్డు వాడుతున్నారని కల్వకుంట్ల కవిత విమర్శిస్తున్నారు. కులాలు, లింగాలు, ఇతర అన్నింటికీ అతీతంగా తెలంగాణ ఉద్యమం బలపడిందని ఆమె అంటున్నారు. తాను ఎదుర్కుంటున్న విమర్శలకు మధు యాష్కీ ముందు జవాబు చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సాధన కోసం అన్ని వర్గాలను కూడగట్టడానికి కెసిఆర్ ప్రయత్నించారని ఆమె చెబుతున్నారు.