కౌంటింగ్ డే .. టీడీపీ గేమ్ ప్లాన్స్ పై అలెర్ట్ గా ఉండాలని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు సూచన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ నిస్తోంది . ఈసారి ఎన్నికల కౌంటింగ్ చాలా ముఖ్యమైన ప్రక్రియ అని, ఎవరు ఏమరపాటుగా ప్రవర్తించవద్దని వైయస్ఆర్సీపీ ఏజెంట్లకు వైసిపి నేత విజయసాయిరెడ్డి సూచనలు చేశారు. కౌంటింగ్ రోజున టిడిపి గేమ్ ప్లాన్ చేస్తోందని ఎవరు ఆ ట్రాప్ లో పడొద్దని, కౌంటింగ్ పై నుండి దృష్టి మరల్చవద్దని ఆయన కౌంటింగ్ ఏజెంట్లను కోరారు.
కౌంటింగ్ రోజున టీడీపీ గేమ్ ప్లాన్ చేస్తుంది .. ఏ మాత్రం దృష్టి మరల్చవద్దన్న విజయసాయిరెడ్డి
కౌంటింగ్ రోజున టీడీపీ ఏజంట్లు కౌంటింగ్ విధానానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసే అవకాశముందని, అడుగడుగున గొడవలకు దిగే సూచనలు ఉన్నాయని అలాంటి సమయంలో ఆవేశాలకు లోనుకావద్దని విజయ్ సాయి రెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకు సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు, పార్టీ సభ్యులు నియంత్రణను పాటించాలని, కౌంటింగ్ విధానంపైన ఏమాత్రం దృష్టి మరల్చ వద్దని ఆయన చెప్పారు. టీడీపీ ఏజెంట్లు కౌంటింగ్ జరిగే ప్రతి స్థాయిలోనూ ఏదో ఒక రగడ చెయ్యాలని చూస్తారని, దీనిని జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ఏజెంట్లు ఏకాగ్రత కోల్పోకూడదని విజయ సాయి రెడ్డి చెప్పారు.
వైసీపీ ఏజెంట్లకు శిక్షణ .. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా
రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అజయ్ కల్లం రెడ్డి, శామ్యూల్ మరియు ఇతర అధికారులు వైసీపీ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ శిక్షణా కార్యక్రమం లోనే కౌంటింగ్ ఏజెంట్లతో మాట్లాడిన విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు వైసిపి పదేళ్ల కృషికి నిదర్శనం అని ఆయన అన్నారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొత్తం సీసీటీవీ లో నమోదు అవుతుంది కాబట్టి ఎవరు ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని వైసిపి ఏజెంట్లకు, నేతలకు సూచించారు విజయ్ సాయి రెడ్డి. ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్న వైసిపి ఎలాంటి గొడవలకు దిగవద్దని వైసీపీ నేతలకు సూచిస్తుంది.
కౌంటింగ్ ప్రక్రియతో పాటు టీడీపీ స్ట్రాటజీ లపై కౌంటింగ్ ఏజెంట్లకు క్లాస్
ఎన్నికల పోలింగ్, అలాగే కౌంటింగ్ సమయాల్లో కూడా సంయమనంతోనే ఉండాలని నిర్ణయించుకుంది. ఎన్నికల సంఘం పైన కానీ, ఎన్నికల అధికారుల పైన కానీ, కౌంటింగ్ అధికారులపైన కానీ ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ సాగాలని భావిస్తోంది.
ఇక టిడిపి ఎన్నికల పోలింగ్ సమయంలో చేసిన ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో కౌంటింగ్ సమయంలోనూ ఆరోపణలు, ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని భావిస్తూ అందుకు అనుగుణంగా వైసిపి కౌంటింగ్ ఏజెంట్లకు తర్ఫీదు నిస్తోంది.