తిరుపతిలో నాటు బాంబుల కలకలం: పేలుడుతో కుక్క మృతి, మరో 6 బాంబుల స్వాధీనం
చిత్తూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో నాటు బాంబులు కలకలం రేపాయి. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి సమీపంలో పొదల్లో నుంచి ఓ కుక్క నాటు బాంబును నోట కరచుకుని బయటకు తెచ్చింది. దీంతో ఒత్తిడికి గురై ఆ నాటు బాంబు ఒక్కసారిగా పేలింది. దీంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది.
భారీ శబ్ధం రావడంతో ఆస్పత్రి సిబ్బందితోపాటు రోగులు భయాందోళనలకు గురయ్యారు. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. ఘటనా స్థలంలోనే పేలకుండా ఉన్న మరో ఆరు బాంబులను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అలిపిరి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, అడవిపందులను వేటడానికి ఈ నాటు బాంబులను కొందరు దుండగులు ఆటోలో తరలిస్తున్నట్లు తెలిసింది. ఆటోలో వారు ఆస్పత్రికి వచ్చిన సమయంలో.. ఆటోలోని బాంబుల కవర్ను కుక్క లాక్కెళ్లడంతో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం.