'జగన్ పై దాడి' శ్రీనివాస్ కు రిమాండ్ గడువు పెంపు;జగన్ పాదయాత్రకు భద్రత పెంచుతాం:డిజిపి ఠాకూర్
విశాఖపట్టణం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి కేసు విచారణ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ కు రిమాండ్ గడువును ఈ నెల 9వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.
గతంలో కోర్టు తీర్పు ప్రకారం నిందితుడు జె.శ్రీనివాస్ పోలీస్ కస్టడీ గడువు ముగియడంతో భారీ బందోబస్తు మధ్య అతడిని కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కస్టడీని పొడిగించాలని సిట్ అధికారులు కోరడంతో న్యాయమూర్తి నిందితుడి రిమాండ్ గడువును ఈ నెల 9వరకు పొడిగించారు. మరోవైపు వైఎస్ జగన్ పాదయాత్రకు భద్రత పెంచనున్నట్లు ఎపి డిజిపి ఆర్.పీ ఠాకూర్ తెలిపారు.
రిమాండ్...గడువు పెంపు
ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడి నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్ పోలీసులు ఆరో రోజు విచారణను ముగించారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు జె.శ్రీనివాసరావుకు విధించిన పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో భారీ భద్రత మధ్య అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. శ్రీనివాస్ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి వుందని...నిందితుడికి కస్టడీ పొడిగించాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరడంతో న్యాయస్థానం నిందితుడి రిమాండ్ గడువును పొడిగించింది.
ఇలా...జరిగివుండొచ్చు
ఇప్పటివరకు నిందితుడి కాల్డేటా ఆధారంగానే పోలీసులు విచారణ కొనసాగించడం, కేసుకు బలమైన ఫోరెన్సిక్ నివేదిక ఇంకా అందకపోవడంతో ఈ కేసులో ఆశించిన పురోగతి లేదన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయని, అందుకే పోలీసులు నిందితుడికి కస్టడీ పొడిగించాలని కోర్టును కోరి ఉంటారని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.
జగన్ కు...భద్రత పెంపు
అంతకుముందు విజయవాడలో డిజిపి ఆర్.పీ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పాదయాత్రకు భద్రత భారీగా పెంచనున్నట్లు తెలిపారు. కేసు విచారణలో భాగంగా జగన్ ను రెండు సార్లు కలసి ఇన్వెస్టిగేషన్కు సహకరించమని అధికారులు కోరడం జరిగిందన్నారు. అధికారులు మరొకసారి జగన్ ను విచారణ కోసం కలుస్తారని తెలిపారు.
అది నా బాధ్యత:డిజిపి
రాజకీయ నాయకులతో పాటుగా ప్రజలకు కూడా రక్షణ కల్పించడం డీజీపీగా తన బాధ్యత అని ఆర్పీ ఠాకూర్ పేర్కొన్నారు. జగన్ పై హత్యాయత్నం కేసు విచారణలో నిందితుడిని తిరిగి కష్టడీలోకి తీసుకోవాలా వద్దా అనేది ఇన్వెస్టిగేషన్ అధికారి నిర్ణయమే తప్ప తమ జోక్యం ఉండదన్నారు. తనకు ఎస్సీ, ఎస్టీ కమీషన్ నుంచి ఎటువంటి నోటీసులు రాలేదని డీజీపీ ఠాకూర్ తెలిపారు.