వైసీపీకి ఊరట .. మోహన్ బాబుకి బెయిల్ మంజూరు.. ప్రచారంలో దూకుడు
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్న మోహన్ బాబుకు ఎర్రమంజిల్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష విధించడంతోపాటు గా జరిమానా విధించింది. కోర్టు తీర్పు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే తనకు బెయిల్ కావాలంటూ పిటిషన్ దాఖలు చేసిన మోహన్ బాబుకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఎన్నికల సమయంలో మోహన్ బాబుకు చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష.. వైసీపీ కి షాక్ ..
30 రోజుల్లో చెక్ బౌన్స్ కు సంబంధించిన నగదును దర్శకుడు వైవీఎస్ చౌదరికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నెలరోజుల లోపు మోహన్ బాబు చౌదరికి చెల్లించాల్సిన 48 లక్షల రూపాయలను చెల్లిస్తే కేసు కొట్టి వేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోహన్ బాబుకు చెక్ బౌన్స్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడం అటు మోహన్ బాబుకు , వైసీపీ శ్రేణులకు ఊరటగా చెప్పొచ్చు.
ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిన తరుణంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచార వేగాన్ని పెంచాయి. అధికార టిడిపి కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి జాతీయ నేతలతో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తోంది. ఇక జనసేన కు బాసటగా మాయావతి ప్రచారాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి మాత్రం తమ కుటుంబాన్ని రంగంలోకి దింపి ప్రచారం నిర్వహిస్తోంది. వైసీపీ తరపున స్టార్ క్యాంపెయినర్లు విజయమ్మ , వైఎస్ షర్మిల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక వైసిపికి బాసటగా ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగారు తాజాగా వైసీపీ తీర్ధం తీసుకున్న మోహన్ బాబు . మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు, వైసిపి నేత మోహన్ బాబు ప్రచార పర్వంలోకి దిగారు. తన మాటలతో ప్రజలను ఆకట్టుకోగల మోహన్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే అది వైసిపికి లాభిస్తుందన్న భావనలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. ఇక ఈ తరుణంలో మోహన్ బాబు పై వెలువడిన కోర్టు తీర్పు వైసీపీ శ్రేణులను టెన్షన్ గురిచేయగా, ప్రస్తుతం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం ఊరటనిచ్చింది. ఇక వైసీపీ తరపున మోహన్ బాబు ప్రచారంలో దూకుడు కొనసాగనుంది .