కరోనా ఎఫెక్ట్: ఏపీ ఎంసెట్ వాయిదా.. మిగతా సెట్స్ కూడా సెప్టెంబర్ మూడో వారానికి: మంత్రి సురేశ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహ్మారి ఉధృతి రోజురోజకూ పెరుగుతోన్న నేపథ్యంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి సెట్ పరీక్షలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ 2020, లా సెట్, ఈ సెట్, పీజీ సెట్ సహా మొత్తం 8 రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం ప్రకటించారు.
జగన్ పై డిప్యూటీ సీఎంకే నమ్మకం లేదు.. బాషాకు హైదరాబాద్లో ట్రీట్మెంట్.. టక్కుఠమారాలన్న సాయిరెడ్డి..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ సూచించారని, ఆ మేరకు విద్యాశాఖ సరైన నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. కరోనా ప్రభావం తగ్గాక.. ఎంట్రెన్స్ టెస్టుల కొత్త తేదీలను ప్రకటిస్తామని, అంచనాల ప్రకారం సెప్టెంబర్ మూడో వారంలో ఎంసెట్ పరీక్ష జరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే జాతీయస్థాయిలో నీట్, జేఈఈ, ఐఐటీ ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డ విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.
ఇంజనీరింగ్, మెడిసిన్ ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ ఎంట్రెన్స్ కోసం ఈ సారి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2.71 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, తొలుత 167 పరీక్ష కేంద్రాలను ప్రకటించారు. కానీ వాటిలో చాలా కేంద్రాలు ఇప్పటికీ క్వారంటైన్ సెంటర్లుగా ఉండటంతో సెంటర్ల సంఖ్య తగ్గించారు. వైరస్ వ్యాప్తి ఎంతకీ కంట్రోల్ లోకి రాకపోవడంతో ఇప్పుడు సెట్ల వాయిదాకే ప్రభుత్వం నిర్ణయించుకుంది.
కరోనా ఎఫెక్ట్ కారణంగా స్కూళ్లు, విద్యాసంస్థలన్నీ సుదీర్ఘకాలంగా మూతపడి ఉండటం, ఇప్పుడప్పుడే తెరుచుకునే అవకాశాలు లేకపోవడంతో ప్రభుత్వాలు ఆన్లైన్ విద్యావిధానం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఏపీలో ఆన్ లైన్ కోర్సుల విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామని విద్యా శాఖ మంత్రి సురేశ్ తెలిపారు. ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వ స్కూళ్లు ఒకలా, ప్రైవేటు బడులు మరోలా అమలు చేస్తుండటం గందరగోళానికి దారితీసిది. దీనిపై క్లారిటీ కోసమే స్పష్టమైన విధానాలు రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.