ఇన్నాళ్లూ ఎన్నికల హడావుడిలో మునిగి తేలి..ఇక కరోనాపై: మంత్రులతో టాస్క్ఫోర్స్: ఢిల్లీలో సాయిరెడ్డి..
అమరావతి: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ జాడలు రోజురోజుకూ తీవ్రమౌతున్నాయి. పొరుగునే ఉన్న తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏపీలో ఈ వైరస్ తీవ్రత భయపడేంత స్థాయిలో లేదనేది అధికార వర్గాల వాదన. అయినప్పటికీ.. కరోనా వైరస్ను కట్టడి చేయడానికి జగన్ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.. ఆలస్యంగానైనా. దీనికోసం కీలక నిర్ణయాలను తీసుకుంది.
హైలెవెల్ టాస్క్ఫోర్స్..
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించడానికి అన్ని రకాల ముందుజాగ్రత్తలను చేపట్టింది. ఇందులో భాగంగా- అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్యశాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ప్రజా వ్యవహారాల విభాగం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఏపీఎన్ఆర్టీ సలహాదారు మేడపాటి ఎస్ వెంకట్లను ఈ టాస్క్ఫోర్స్లో సభ్యులుగా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
విదేశాంగ వ్యవహారాల బాధ్యతలు సాయిరెడ్డికి..
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వీ విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించింది జగన్ సర్కార్. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపాలని ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులను స్వరాష్ట్రానికి రప్పించడానికి అవసరమైన చర్యలను విజయసాయి రెడ్డి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయనను ఢిల్లీలోనే ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ విదేశాల్లో చదివే విద్యార్థులను రాష్ట్రానికి రప్పించాలని సూచించింది.
రెండు కంట్రోల్రూములు ఏర్పాటు..
విదేశాల్లో చదువుకునే ఏపీ విద్యార్థుల వివరాలను ఆరా తీయడానికి దేశ రాజధానిలోని ఏపీ భవన్, వెలగపూడిలోని సచివాలయంలో గల ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలో వేర్వేరుగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. ఏపీ భవన్ ఉద్యోగులు పీ రవిశంకర్ (9871999055), దేవేందర్ (9871999059), సచివాలయంలో మహ్మద్ కరీముల్లా షేక్ (8971170179), డీ మోహన్ కుమార్ (8297259070) ఈ రెండు కంట్రోల్రూమ్లను పర్యవేక్షిస్తారు.
కేంద్రం సూచించిన మార్గదర్శకాలన్నీ..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలన్నీ యధాతథంగా అమలు చేయాల్సి ఉంటుందని వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయం అధికారులు ఇప్పటికే అన్ని జిల్లాలకూ ఆదేశాలను పంపించారు. గ్రామస్థాయిలో వైరస్ విస్తరించకుండా ముందుజాగ్రత్త చర్యలను చేపట్టడానికి మండల రెవెన్యూ అధికారి మొదలుకుని, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల సిబ్బంది వరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్నీ భాగస్వామ్యులను చేయాలని సూచించారు.
Recommended Video
స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి లేకపోవడంతో..
స్థానిక సంస్థల ఎన్నికలు ఆరువారాల పాటు వాయిదా పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇక రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టిని, అధికార యంత్రాంగం మొత్తాన్నీ కరోనా వైరస్ నియంత్రణపైనే కేంద్రీకరించింది. ఎన్నికల హడావుడి తొలగిపోవడం.. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులు ఘాటు విమర్శలతో విరుచుకుపడుతుండటంతో జగన్ సర్కార్ కాస్త ఆలస్యంగానైనా కళ్లు తెరిచినట్టు కనిపిస్తోంది.. ఈ చర్యలను చూస్తోంటే.