ఇంగ్లాండ్ నుంచి వచ్చిన విశాఖ యువకుడిలో: ఏపీలో మరో పాజిటివ్: 12కు చేరిన కరోనా కేసులు.. !
విశాఖపట్నం: భయానక కరోనా వైరస్ జాడలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టంగా లాక్డౌన్ను నిర్వహిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్థానికుల నుంచి స్థానికులకు ఈ వైరస్ వ్యాపించట్లేదు. అయినప్పటికీ.. విదేశాల నుంచి ఏపీలోని తమ స్వస్థలాలకు చేరిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మన రాష్ట్రంలో నమోదైన కేసులన్నీ అలాంటివే.
తాజాగా విదేశాల నుంచి వచ్చిన యువకుడి కుటుంబ సభ్యుల్లో ఒకరు కరోనా వైరస్ బారిన పడటం కలవరానికి గురి చేస్తోంది. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ నుంచి విజయవాడకు చేరిన 29 సంవత్సరాల యువకుడిలో కరోనా వైరస్ కనిపించిన 24 గంటల వ్యవధిలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నుంచి కొద్దిరోజుల కిందటే విశాఖపట్నంలోని తన ఇంటికి చేరుకున్న ఓ యువకుడిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. అతనికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు.
వెంటనే అతణ్ని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆ యువకుడు కరోనా పాజిటివ్గా తేలడంతో అతని కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల సందర్భంగా అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైరస్ సోకినట్లు తేలింది. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 12కు చేరింది.
బర్మింగ్హామ్ నుంచి వచ్చిన 25 సంవత్సరాల యువకుడు విశాఖపట్నం సమీపంలోని పద్మనాభపురం మండలానికి చెందినవాడు. ఈ నెల 17వ తేదీన ఆయన బర్మింగ్హామ్ నుంచి విశాఖపట్నానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి అతను హోమ్ క్వారంటైన్లో ఉంటున్నాడు. హోమ్ క్వారంటైన్లో ఉన్న సమయంలో అతని ద్వారా కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైరస్ సోకిందని నిర్ధారించారు. ఆ కుటుంబ సభ్యుడిని విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ (విమ్స్)కు తరలించారు.