కోవిడ్-19 ఎఫెక్ట్: ఏపీలో రియల్ ఎస్టేట్ ఢమాల్.... నిలిచిన బడా ప్రాజెక్టులు.. బ్యాంకులు రుణాలు ఇస్తాయా
అమరావతి: కరోనావైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేసింది. ఒక్కసారిగా ఈ మహమ్మారి విజృంభించడంతో దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో అన్ని రంగాలు షట్డౌన్ ప్రకటించాయి. ఇక ఒక్కసారిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. భారత్ ఇందుకు మినహాయింపు కాదు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవి తాత్కాలికంగానే కనిపిస్తున్నాయిన తప్పా... పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. ఇక ఒక్కసారి లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే అప్పుడు ఆర్థిక వ్యవస్థ ఎలాగుంటుందనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే నవ్యాంధ్ర ప్రదేశ్లో మాత్రం లాక్డౌన్ వేళ ఆర్థిక పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అక్కడ ప్రాజెక్టులన్నీ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి పాట్లు తప్పడం లేదు.
నిలిచిపోయిన బడా ప్రాజెక్టులు
కరోనావైరస్ మహమ్మారితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దుర్బరంగా మారింది. వాస్తవ పరిస్థితి అంతుచిక్కడం లేదు. రాజధాని ప్రాంతం ఏరాష్ట్రంలో లేనంతగా తయారు అవుతుందని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చెప్పినప్పటికీ కరోనా కల్లోలంలో కొట్టుకుపోయిందనే వాస్తవాన్ని కాదనలేము. ఇక ఏపీలో భారీ ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయి. దీంతో రాష్ట్రానికి తీరని నష్టం చేకూరింది. ఇక ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం ప్రత్యక్షంగా పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి కల్పించింది. ఇక కరోనావైరస్ దెబ్బకు ప్రాథమిక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 4,500 ప్రాజెక్టులు నిలిచిపోయినట్లు సమాచారం.
లాక్డౌన్ తర్వాత పుంజుకుంటుందా..?
ఇదిలా ఉంటే కొన్ని నెలల్లోనే తిరిగి కోలుకుంటుందని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి ప్రధాన నగరాలతో పాటు కొన్ని పట్టణాల్లో కూడా రియల్ బూమ్ తిరిగి కోలుకుంటుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు రియల్ ఎస్టేట్ రంగం ఇసుక కొరతతో నష్టపోగా... ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా కోవిడ్-19 మహమ్మారితో మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) బలోపేతంకు రియల్ ఎస్టేట్ రంగం దోహదపడటంలో రెండో స్థానంలో ఉందని ఏపీ ఛైర్మెన్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) సుబ్బరాజు చెప్పారు. అంతేకాదు ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తుందని వెల్లడించారు. కోవిడ్-19తో దాదాపుగా 3వేల నుంచి 4వేల వరకు రియల్ ఎస్టేట్ హౌజింగ్ ప్రాజెక్టులు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పిన సుబ్బరాజు... కొన్ని కోట్ల రూపాయలు ఇరుక్కుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్ఆర్ఐల పైనే ఆశలు
ఇక కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకుని లాక్డౌన్ ఎత్తివేస్తే రియల్ ఎస్టేట్ రంగం సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటుందని సుబ్బరాజు చెప్పారు. ఇదిలా ఉంటే యూరోప్ దేశాల్లో, అమెరికా దేశంలో ఉన్న ఎన్ఆర్ఐలు తిరిగి సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు వస్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో రియల్ రంగం తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయా దేశాల నుంచి తిరిగి వచ్చిన వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు కాబట్టి తిరిగి పరిస్థితి చక్కబడుతుందని జోస్యం చెప్పారు సుబ్బరాజు. అయితే కొందరు బిల్డర్లు మాత్రం ఇందుకు భిన్నంగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. లాక్డౌన్ ఎత్తివేత తర్వాత ఉద్యోగ భద్రతపై అనుమానాలు నెలకొంటాయనే ఆందోళన వ్యక్తం చేశారు. జాబ్ మార్కెట్ స్థిరంగా ఉండే వరకు చాలామంది తమ ప్లాన్లను వాయిదా వేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
బ్యాంకులు రుణాలు ఇస్తాయా..?
మే 3 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగిస్తే వేతనాల్లో కోత విధించడం జరుగుతుందని పరిస్థితి మరీ దిగజారితే ఉద్యోగాల తొలగింపు కూడా ఉండే అవకాశముంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్యాంకులు కూడా ఇంటి రుణాలు మంజూరు చేసేందుకు చాలా ఆలోచించే పరిస్థితి తలెత్తుతుందని వెల్లడించారు. ఇక రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తారన్న ప్రతిపాదన రావడంతో విశాఖలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటాయి. విశాఖలో ప్లాట్లు, అపార్ట్మెంట్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్లాట్ల విషయానికొస్తే చదరపు అడుగుకు రూ.500 నుంచి రూ.700 వరకు ధరలు పెరిగాయి. మార్చి మొదటి వారం వరకు సేల్స్ విపరీతంగా పెరిగిపోయాయి.
మొత్తానికి కోవిడ్-19 మొత్తం పరిస్థితిని మార్చేసింది. కరోనావైరస్ నుంచి విముక్తి తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ బిల్డర్లు మాత్రం వెంటనే తమ అపార్ట్మెంట్లను అమ్మకానికి పెట్టరని తెలుస్తోంది. ధరలు పెరిగే వరకు అట్టే ఉంచి పెరిగాక అమ్మే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Recommended Video