రాజ్యసభ ఎన్నికలు వాయిదా: ఏపీలో నాలుగు స్థానాలకు నిలిచిన పోలింగ్ : కరోనా ఎఫెక్ట్ తో నిర్ణయం..!
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కల్లోలం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న వేళ..ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ సీట్ల కోసం ఫిబ్రవరి 25న ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో ఇప్పటికే 37 సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మిగిలిన 18 స్థానాలకు ఈ నెల 26న పోలింగ్ జరగాల్సి ఉంది. తెలంగాణలో ఖాళీ అయిన రెండు స్థానాలు సైతం ఏకగ్రీవమయ్యాయి. అయితే, ఏపీలో నాలుగు స్థానాలకు గాను వైసీపీ నుండి నలుగురు..టీడీపీ నుండి ఒకరు పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయంతో వాయిదా పడిన ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ..కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత ఖరారు కానుంది. అయితే, రాజ్యసభ లో సంఖ్య పరంగా సభా నిర్వహణ కు ఇబ్బంది లేకపోవటంతో..కరోనా ఎఫెక్ట్ తో ఈ ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఏపీలో నాలుగు సీట్లకు ఎన్నికలు వాయిదా..
ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వటంతో వాటి భర్తీ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ నుండి రాజ్యసభ సభ్యులుగా ఉన్న కే కేశవరావు, ఏకే ఖాన్, టి సుబ్బిరామిరెడ్డి, సీతారామ లక్ష్మి కాల పరమితి ముగిసింది. దీంతో..వారి స్థానంలో ప్రస్తుతం ఏపీ శాసనసభలో ఉన్న సంఖ్యా బలం ఆధారంగా నాలుగు స్థానాలు వైసీపీకి దక్కనున్నాయి. అయితే, ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ సైతం అనూహ్యంగా తమ అభ్యర్దిని బరిలోకి దింపింది. వర్ల రామయ్య టీడీపీ నుండి నామినేషన్ దాఖలు చేసారు. ఇక, వైసీపీ నుండి అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్, పారిశ్రామిక వేత్త పరిమల్ నత్వానీ నామినేషన్లు వేసారు. నాలుగు స్థానాలకు ఈ నెల 26న పోలింగ్ జరగాల్సి ఉంది. ఇందు కోసం ఏపీ శాసనసభా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. అయితే, దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలంతో ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించింది. త్వరలోనే ఎన్నికల నిర్వహణ పైన ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.
మొత్తం 18 స్థానాలకు జరగాల్సిన ఎన్నికలు
ఏపీలోని నాలుగు స్థానాలతో సహా దేశ వ్యాప్తంగా మొత్తం 18 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో గుజరాత్ నుండి నాలుగు స్థానాలు, రాజస్థాన్ తో పాటుగా మధ్య ప్రదేశ్ నుండి మూడు స్థానాల చొప్పున , ఇక, జార్ఖండ్ నుండి రెండు స్థానాలు, మణిపూర్ , మేఘాలయ నుండి ఒక్కో స్థానానికి ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసారు. అయితే, ప్రస్తుతం ఎన్నికలు వాయిదా వేసినా..సంఖ్యా పరంగా రాజ్యసభ సమావేశానికి ఎటువంటి ఇబ్బంది లేకపోవటంతో కరోనా ప్రభావం కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో పోలింగ్ కొనసాగిస్తే..ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల నుండి సంబంధిత రాష్ట్రాల అసెంబ్లీకి చేరుకోవాల్సి ఉంటుంది. 20 రాష్ట్రాలకు పైగా కరోనా ప్రభావంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో..కొద్ది సేపటి క్రితం ఎన్నికల సంఘం ఎన్నికలను వాయదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.