ఇంట్లో చికిత్సకే వృద్ధులు మొగ్గు..చివరి నిమిషంలో....అందుకే అలా: వైద్యాధికారులు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే అక్కడ 7998 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో చాలామంది పెద్ద వయస్సు ఉన్నవారు కరోనా పరీక్షల్లో పాజిటివ్ రాగా వారంతా హోం క్వారంటైన్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. చివరి నిమిషంలో హాస్పిటల్కు చేరుకుంటున్నారు. ఇలా చివరి నిమిషంలో వచ్చిన వారు కోలుకోవడం కష్టంగా మారుతోందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
చివరి నిమిషంలో హాస్పిటల్స్కు...
ఏపీలో కరోనావైరస్ విజృంభిస్తుండటంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. జూన్ 30న 14,515 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా జూలై 22 నాటికి ఆ సంఖ్య 64,713కు చేరుకుంది. జూలై 1 నుంచి జూలై 22వరకు మొత్తం 630 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇందులో 489 మరణాలు జూలై 13 నుంచి జూలై 22 మధ్య సంభవించాయి. ఇక మృతి చెందిన వారిలో 90శాతం మంది 55 నుంచి 65 వయస్సు మధ్య ఉన్నవారే అని కోవిడ్-19 రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ ఓ జాతీయపత్రికతో చెప్పారు. చివరి నిమిషంలో వారంతా హాస్పిటల్స్కు వస్తున్నారని, ఆ సమయంలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని చెప్పారు. పెద్ద వయసున్న వారు ఇళ్లకే పరిమితమై చికిత్స తీసుకోవడంతో పాటు కొన్ని హోమ్ రెమిడీస్ను పాటిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో చాలామంది తీవ్ర అనారోగ్యంకు గురవుతున్నారని వివరించారు.
యువత కారణంగా ఇంట్లో వృద్ధులకు..
ఇక రాష్ట్రంలో లాక్డౌన్ పై ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఇటు యువతలోను అటు వృద్ధుల్లోను ఎక్కవైయ్యాయని అధికారులు చెప్పారు. యువత సరైన జాగ్రత్తలు పాటించకుండా బయట తిరిగేసి ఇంటికి చేరుకుంటుంన్నందున ఇంట్లో ఉండే వృద్ధులకు చాలా సులభంగా వైరస్ వ్యాపిస్తోందని అధికారులు చెప్పారు. ఇక ఇళ్లలో ఉన్న వృద్ధులు అప్పటికే ఇతర రోగాలతో బాధపడుతున్నట్లయితే వారు కోవిడ్ బారిన చాలా తొందరగా పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇక అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 60శాతం పాజిటివ్ కేసులు 15 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు ఉన్నాయని, 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు కోవిడ్ బారిన పడుతున్నది 25శాతంగా ఉందని తెలుస్తోంది. ఇది లాక్డౌన్ సమయంలో 10శాతం తక్కువగా ఉన్నింది.
Recommended Video
కర్నూలులో పరిస్థితి దారుణం
కర్నూలులో కరోనావైరస్ పాజిటివ్ కేసులు 8వేలకు చేరువలో ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు 130 ఒక్క కర్నూలు జిల్లాలోనే చోటుచేసుకున్నాయి. ఇందులో చనిపోయిన 115 మంది యుక్త వయస్సులో ఉండి ఇతర జబ్బులతో బాధపడుతున్నవారే అని కర్నూలు జిల్లా వైద్యాధికారులు చెప్పారు. వీరంతా ఇళ్లల్లోనే ఉండి సొంత చికిత్సను తీసుకున్నారని... వైద్యులను సంప్రదించలేదని చెప్పారు. దీంతో వ్యాధి బారిన పడిన వీరి ఆరోగ్యం మరింత క్షీణించిందని చెప్పారు. హాస్పిటల్కు చివరి నిమిషంలో చేరుకోగా అప్పటికే వారి పరిస్థితి విషమంగా మారిందని వెల్లడించారు. అయితే వెంటిలేటర్లపై ఉంచి వారికి చికిత్స చేస్తు కొంతమంది ప్రాణాలను కాపాడుతున్నామని కర్నూలు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.