ఏపీ అసెంబ్లీలో కరోనా- ఎమ్మెల్యే కారుమూరికి పాజిటివ్- చీరలు తీసుకున్న వారిలో భయం..
ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం రేగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు తాజాగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో మిగతా ఎమ్మెల్యేలు, మంత్రుల్లోనూ భయాలు మొదలయ్యాయి. ఇప్పటికే కరోనా కారణంగా పలువురు ఎమ్మెల్యేలు సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.
వైసీపీకి చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. నిన్న ఆయన అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలతో, మంత్రులతో సన్నిహితంగా మెలిగారు. అనంతరం వారికి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చీరలు కూడా పంచారు. స్వయంగా ఆయన నుంచి చీరలు అందుకున్న సదరు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఇప్పుడు కరోనా భయాలు మొదలయ్యాయి. అనుమానం ఉన్న ఎమ్మెల్యేలు కూడా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు సిద్దమవుతున్నారు.
వాస్తవానికి రాష్ట్రంలో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడంతో పలు జాగ్రత్తలు తీసుకుని ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు వచ్చే సిబ్బందికి కూడా అసెంబ్లీలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. భౌతిక దూరంతో పాటు ఇతర నిబంధనలను అమలు చేస్తున్నారు. అయినా అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేకే కరోనా సోకడంతో అసెంబ్లీ పరిసరాల్లో ఉన్న సిబ్బంది భయపడుతున్నారు. అసెంబ్లీ మరో రెండు రోజులు జరిగే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.