ఏపీ సచివాలయంలో కరోనా కలకలం
కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్నా ప్రభుత్వ పాలనకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు హైదరాబాద్ నుంచి ఆఘమేఘాల మీద ఉద్యోగులను ఏపీ సచివాలయానికి రప్పించడం వైరస్ వ్యాప్తికి దారులు తెరిచింది. హైదరాబాద్ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో అమరావతి వచ్చిన ఓ ఉద్యోగికి ఇప్పుడు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు.
మంగళగిరి మండలం నవులూరులోని గోలి వారి తోటలో ఉన్న ఓ అపార్ట్ మెంట్లో నివాసముంటున్న వ్యవసాయశాఖ ఉద్యోగికి కరోనా ఉన్నట్లు తేలడంతో ఇప్పుడు అధికారులు తలపట్టుకుంటున్నారు. మఖ్యంగా ఆయనతో కలిసి సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వచ్చిన వారికి కరోనా సోకిందేమో అన్న అనుమానంతో క్వారంటైన్ కు వెళ్లాలని సూచిస్తున్నారు.
సచివాలయంలో ఆయనతో కలిసి విధులు నిర్వర్తించిన వారిపైనా నిఘా పెట్టారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే క్వారంటైన్ కు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. మంగళగిరిలోనూ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.