కరోనాపై మెగాస్టార్ మెగా మెసేజ్: నిర్లక్ష్యంతో ప్రాణం మీదికి: గుంపుగా తిరగొద్దు.. ఇంటి దగ్గరే ఉండండి
అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే 168 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మనదేశంలో నమోదయ్యాయి. ముగ్గురు మృత్యువాత పడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కరోనా వైరస్కు మినహాయింపేమీ కాదు. తెలంగాణలో 13 మందిలో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఈ వైరస్ తీవ్రత తక్కువే. ఇప్పటిదాకా నెల్లూరు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది. బాధిత యువకుడు కూడా పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు వెల్లడిస్తున్నారు.
Recommended Video
వైరస్ బారిన పడకుండా..
ప్రాణాంతక కరోనా వైరస్ భయానకంగా చెలరేగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కొన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల దాని బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చని కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి సూచించారు. కరోనా వైరస్ సోకిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే.. అది రాకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడమే మేలు అని, దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మన చేతుల్లోనే ఉన్నాయని ఆయన చెప్పారు.
వీడియో ద్వారా సందేశం..
కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ వీడియో సందేశాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిమిషం 16 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియో ద్వారా చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుజాగ్రత్త చర్యలను సూచించారు. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తోందని, ఈ పరిస్థితుల్లో మనకేమీ కాదనే నిర్లక్ష్యం పనికి రాదని హెచ్చరించారు. జాగ్రత్తగా ఉంటూ, ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
జన సమూహానికి దూరంగా..
ప్రజలు గుంపుగా తిరగొద్దని, జన సమూహానికి దూరంగా ఉండాలని చిరంజీవి సూచించారు. వీలైనంత వరకు ఇంటి వద్దే గడపాలని, అదే ఉత్తమం అని చెప్పారు. అరచేతుల వరకే కాకుండా మోచేతుల దాకా సబ్బుతో కనీసం 20 సెకెన్ల పాటు శుభ్రం చేసుకోవాలని అన్నారు. తుమ్మినా, దగ్గినా కర్చీఫ్ లాంటివి లేదా టిష్యూ పేపర్ను అడ్డంగా పెట్టుకోవటం తప్పనిసరి అని చెప్పారు. అలా వినియోగించిన టిష్యూ పేపర్లను మూత ఉన్న చెత్తబుట్టలో వేయాలని అన్నారు. అనవసరంగా చేతులను కళ్లు, నోరు, ముక్కు, ముఖానికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
జ్వరం, జలుబు, దగ్గు ఉంటే..
జ్వరం, జలుబు, దగ్గు, అలసటలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని చిరంజీవి సూచించారు. జలుబు, దగ్గు ఇతరులకు అంటకుండా తమకు తాముగా బాధితులు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖానికి మాస్క్ను ధరించాలని చెప్పారు. కరోనా ప్రమాదకారి కాకపోయినప్పటికీ.. నిర్లక్ష్యంగా ఉండకూడదని చెప్పారు. తమకేమీ కాదని పట్టనట్టు ఉండటం వల్ల అది మహమ్మారిగా మారుతుందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉందని చెప్పారు. ఎవరికీ షేక్హ్యాండ్ ఇవ్వొద్దని, మన సంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దామని సూచించారు.