ఏపీలో మరో మహమ్మారి కల్లోలం.. వైసీపీ ఎమ్మెల్యేలతో స్పీకర్ సీతారాం పోటీ.. టార్గెట్ జగన్..
కరోనా వైరస్ను పాండమిక్(మహ్మారి)గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ పాండమిక్ ప్రధాన లక్షణం.. ప్రజల్ని భయోత్పాతానికి గురిచేయడం. కానీ ఏపీలో ఇప్పుడు కరోనాను మించి.. పబ్లిసిటీనే పాండమిక్ కల్లోలం రేపుతున్నది. కేబినెట్ విస్తరణ ఊహాగానాల నడుమ అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు వింత ప్రయత్నాలతో సీఎం జగన్ దృష్టిలో పడేందుకు ఆరాటపడుతున్నారు. ఆక్రమంలో లాక్ డౌన్ రూల్స్ ను ధిక్కరిస్తూ, తెలియకుండానే వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. ఎమ్మెల్యేలకు ధీటుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా మాస్ గ్యాదరింగ్లో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
ఏపీ కరోనా విలయం: కర్నూలు కకావికలం.. షాకింగ్ నంబర్స్.. కృష్ణా, గుంటూరులో భయంభయం..
పేరొకటి.. చేసింది మరోటి..
కొవిడ్-19కు ఇంకా మందు కనిపెట్టని నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ‘సోషల్ డిస్టెన్స్' ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి స్థానిక ప్రభుత్వాల దాకా పదే పదే చెబుతున్నాయి. అదే విషయాన్ని తన సొంత నియోజకవర్గమైన ఆముదాలవలస ప్రజలకు తెలియజెప్పేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ కార్యక్రమం చేపట్టారు. పట్టణం నడిబొడ్డున టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు వేయగా, భారీ సంఖ్యలో హాజరైన జనాన్ని ఉద్దేశించి స్పీకర్ మాట్లాడారు. సోషల్ డిస్టెన్స్ అవశ్యకతను ఆయన వివరించారు. ఈ వీడియోలు వైరస్ కావడంతో సభ జరిగిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ డిస్టెన్స్ పట్ల అవగాహన కల్పించడానికి ప్రజల్ని ఒక్కటిగా చేసి ప్రసంగించడమేంటనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.
తీరొక్క వెరైటీ..
పలు జిల్లాల్లో అధికార పార్టీ నేతలు తీరొక్క రీతిలో లాక్ డౌన్ నియమాలు బేఖాతరు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్ల ర్యాలీ తీస్తే, పలమనేరు ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ మందీమార్బలంతో బ్రిడ్జి ఓపెనింగ్ చేశారు. ఇదే జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజాపై పారిశుద్ధ్య సిబ్బంది పూలవర్షం కురిపించిన వీడియో వివాదాస్పదమైంది. అటు నెల్లూరు జిల్లాకోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కూమార్ రెడ్డి ఏకంగా ఐదు వేల మందిని పోగుచేసి, నిత్యావసర సరుకులు పంచడంతో పోలీసులు అడ్డుకున్నారు. తనపై పోలీసుల చర్యను తప్పుపడుతూ ఆయన ఏకంగా స్టేషన్ లోనే ధర్నాకు దిగడం, చివరికి ఉన్నతాధికారుల హామీతోగానీ ఎమ్మెల్యే వెనక్కి తగ్గలేదు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య కూడా బుధవారం భారీ ర్యాలీ చేపట్టారు.
కొవిడ్ ఇడియట్స్ అంటూ..
లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేశారన్న కారణంగా సామాన్యులను పోలీసులు చావబాదుతుండటం, ఏవైనా వీడియోలు బయటికొస్తే సదరు సిబ్బందిపై చర్యలకు ఆదేశించడం ఏపీలో పరిపాటిగా మారింది. సామాన్యులు ఒంటరిగా రూల్స్ ని బ్రేక్ చేస్తే.. అధికార వైసీపీ నేతలు మాత్రం గుంపులుగా రోడ్లపైకి వస్తుండటం గమనార్హం. ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రజా ప్రతినిధులే ఇలా చేస్తుండటంతో ఏపీ నేతల వ్యవహారం జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. వీళ్లను ‘కొవిడ్ ఇడియట్స్' గా అభివర్ణిస్తూ, అదే హ్యాష్ ట్యాగ్ తో సదరు వీడియోలను నెటిజజన్లు షేర్ చేస్తున్నారు.
Recommended Video
పెరుగుతోన్న కేసులు..
ఏపీ ఆరోగ్య శాఖ వెలువరించిన తాజా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొవిడ్-19 కేసుల సంఖ్య 955కు పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 62 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా 29కి పెరిగింది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 261 కేసులు, గుంటూరులో 206, కృష్ణా జిల్లాలో 102 కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ ఎత్తేసిన మరుక్షణమే స్థానిక ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ జరగొచ్చన్న రిపోర్టుల నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు ఈరకంగానూ ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.