ఏపీలో కోరానా: గుడ్న్యూస్ - భారీగా తగ్గిన మరణాలు - రికవరీలో దేశంలోనే టాప్ - కొత్తగా 3,620 కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారికి సంబంధించి చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ వెలువడింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పీక్స్ కు చేరిన తర్వాత, ఇటీవల ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో దేశంలోనే అత్యధిక రికవరీ రేటును కలిగిన రాష్ట్రంగానూ ఏపీ నిలిచింది. అంతమాత్రాన అసలసత్వం తీసుకోరాదని, స్పెషల్ డ్రైవ్ చేపట్టాలంటూ సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు కూడా కొవిడ్-19 అవగాహన కార్యక్రమాలు కొనసాగాయి. వివరాల్లోకి వెళితే..
కరోనా వ్యాక్సిన్పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూ
ఇవీ తాజా లెక్కలు..
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3620 కొత్త కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. ఒక రోజులో మరణాల సంఖ్య ఇంత తక్కువగా ఉండటం ఐదు నెలల్లో తొలిసారి. బుధవారంతో పోల్చుకుంటే తాజాగా బయటపడిన కొత్త కేసుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గడం గమనార్హం. కొత్తవాటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలకు చేరువ(7,96,919)కాగా, మొత్తం మరణాల సంఖ్య 6524కి చేరింది. కరోనా మరణాల్లో జాతీయ సగటు 1.51శాతంకాగా, ఏపీలో అది 0.82 శాతంగా ఉంది.
దేశంలోనే మొదటి స్థానం..
కరోనా టెస్టులు విస్తృతంగా చేస్తుండటంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కేసుల సంఖ్య భారీగా ఉండటం తెలిసిందే. ఏపీలో గడిచిన 24 గంటల్లో 76,726 శాంపిల్స్ పరీక్షించారు. తద్వారా మొత్తం టెస్టుల సంఖ్య 73లక్షల 47వేల 776కు చేరింది. రికవరీలకు సంబంధించి జాతీయ సగటు 88.8 శాతంకాగా, ఆంధ్రప్రదేశ్ లో అది 95.1 శాతంగా ఉంది. తద్వారా రికవరీల్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గురువారం ఒక్కరోజే 3,723మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జికాగా, ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 7,58,138గా ఉంది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల 32,257గా ఉందని బులిటెన్ లో పేర్కొన్నారు.
జిల్లాల వారీగా ఇలా..
కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంకా ఉదృతి కొనసాగుతుండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులకు సంబంధించి అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 631, తూర్పు గోదావరిలో 492, చిత్తూరు 412, గుంటూరు 385, కృష్ణా జిల్లాలో 370, ప్రకాశం 311, కడప 212, అనంతపురం 196, విశాఖపట్నం 171, నెల్లూరు 126, శ్రీకాకుళం 126, విజయనగరం 122, కర్నూలు జిల్లాలో 66 కొత్త కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 16 మంది చనిపోగా, అందులో గుంటూరుకు చెందిన నలుగురు, చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించగా, అనంతపురం, కడప, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
Recommended Video
ఆరోగ్య శాఖ స్పెషల్ డ్రైవ్..
కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 10 రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. సీఎస్ నీలం సాహ్ని విజయవాడలో బుధవారం భారీ ర్యాలీ ద్వారా స్పెషల్ డ్రైవ్ ప్రారంభించగా, రెండో రోజైన బుధవారం ఆరోగ్య శాఖ సిబ్బంది ఆయా పీహెచ్ సీల పరిధిలో కార్యక్రమాలు చేపట్టారు. ఈ నెల 31 వరకు కరోనా అవగాహన డ్రైవ్ కొనసాగనుంది.
విశాఖలో భారీగా ఉద్యోగాలు పెరిగాయి - జక్కన్న చెక్కాడు - వాళ్లను జగన్ ఈడ్చికొట్టాలి: ఎంపీ రఘురామ