ఏపీలో కరోనా: వైరస్ హాట్స్పాట్ కర్నూలు.. ఒకేరోజు 49 కొత్త కేసులు.. మొత్తం 252కు పెరుగుదల
ఒకవైపు సీఎం జగన్.. వైరస్ కట్టడికి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నా.. కొవిడ్-19 కేసులు ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఏపీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం రాత్రి విడుదల చేసిన బులిటెన్ లో రాష్ట్రవ్యాప్తంగా 60 కొత్త కేసులు నమోదైనట్లు వెల్లడైంది. తద్వారా మొత్తం కేసుల సంఖ్య 252కు పెరిగింది. కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి నాటికి 4 కేసులు మాత్రమే ఉండగా.. ఆదివారం రాత్రికి అది 53కు పెరగడం సంచలనంగా మారింది.
Recommended Video
ఆదివారం రాత్రి విడుదలైన కరోనా బులిటెన్ లో జిల్లాల వారీగా లెక్కల్లోనూ కర్నూలు టాప్ లో నిలవడం గమనార్హం. అక్కడ మొత్తం 53 పాజిటివ్ కేసు నమోదయ్యాయి. ఆ తర్వాత ఎక్కువగా నెల్లూరు జిల్లాలో 34, గుంటూరు 30, కృష్ణా 28, ప్రకాశం 23, కడప 23, చిత్తూరులో 17, విశాఖపట్నం 15, వెస్ట్ గోదావరి 15, ఈస్ట్ గోదావరి 11, అనంతపురం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని ఆస్పత్రుల్లో కరోనా ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని, అన్ని జిల్లాల్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాలని అధికారులకు సూచించారు. ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంలో ఆయనీ నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో మొత్తం కేసులు 252 పెరగ్గా, దేశవ్యాప్తంగా ఆ సంఖ్య 4,120గా ఉంది. ఇండియాలో ఇప్పటిదాకా కరోనా వల్ల 108మంది చనిపోయారు. అందులో ఏపీకి చెందిన వ్యక్తి ఒకరున్నారు.