కరోనాపై జగన్ చెప్పినట్లే జరుగుతోంది.. అంబటి రాంబాబుకూ పాజిటివ్.. చికిత్సలపై టీడీపీ విమర్శలు
కరోనా మహమ్మారి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంచనాలు మొదటి నుంచీ తప్పడంలేదు. రాబోయే కాలంలో ప్రజలంతా కరోనాతో కలిసి జీవించాల్సి ఉంటుందని దేశంలోనే తొలుత స్టేట్మెంట్ ఇచ్చిన రాజకీయ నేత ఆయన. ఆ తర్వాత అదే మాటను ప్రధాని మోదీ దగ్గర్నుంచి మిగతా వాళ్లంతా చెప్పారు. ''ఇంకొద్ది రోజులు పోతే.. నాతో సహా ఎవరికైనా కరోనా రావొచ్చు.
Recommended Video
దీనికి మనం పెద్దగా భయపడాల్సిన పనిలేదు. అనవసరంగా భయాలు, భ్రమలు పెట్టుకోవద్దు. చికిత్స కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది''అని కొద్ది రోజుల కిందట ప్రెస్ మీట్ లో సీఎం వ్యాఖ్యానించారు. సరిగ్గా ఆయన చెప్పినట్లుగానే.. ఏపీలో పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతోపాటు అధికార పార్టీకే చెందిన నేతలు ఒక్కొక్కరుగా ఇన్ఫెక్షన్ కు గురవుతున్నారు.
జగన్ గృహప్రవేశం నాడే రోజా కుండబద్దలు - వేణుగోపాల్ మాటే ఫైనల్ - రఘురామకు రాష్ట్రపతి రివర్స్ షాక్
అంబటి రాంబాబు కూడా..
వైసీపీ కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బుధవారం ఉదయం ఆర్టీపీసీ విధానంలో టెస్టులు చేయగా వైరస్ సోకినట్లు బయటపడిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. ర్యాపిడ్ కిట్స్, స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వచ్చాయని, సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్, మరోసారి పాజిటివ్ వచ్చినట్లు వార్తలు రావడంతో వాటిపై అంబటి వివరణ ఇచ్చారు. ఆర్టీపీసీ విధానంలోనే వైరస్ నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు.
ధైర్యంగా ఉన్నాను.. త్వరలోనే వస్తా..
అంబటి రాంబాబుకు కరోనా సోకిందంటూ బుధవారం ఉదయం నుంచే మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన వైసీపీ ప్రధాన కార్యదర్శి కూడా కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు, పరిచయస్తులు ఆ వార్తలను చూసి కంగారుపడ్డారు. ఆ మేరకు తన మొబైల్ కు గ్యాప్ లేకుండా ఫోన్లు వచ్చాయని రాంబాబు తెలిపారు. సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. తాను ధైర్యంగా ఉన్నానని, తన ఆరోగ్యం గురించి ఎవరూ కంగారు పడొద్దని కోరారు. ‘‘ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నాను. కాబట్టి కొన్నాళ్ల పాటు ఎవరితోనూ మాట్లాడలేను. పదే పదే ఫోన్లు వస్తుండటం వల్లే ఈ వీడియోను పెడుతున్నాను. త్వరలోనే కోలుకుని మళ్లీ బయటికొస్తాను..''అని అంబటి తెలిపారు.
అధికార పార్టీ నేతలే ఎక్కువగా..
విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పేందుకో, ప్రభుత్వ పథకాల అమలుకు పర్యవేక్షణలు జరుపుతున్నందుకోగానీ అధికార పార్టీ నేతలే ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం గమనార్హం. ఏపీలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డిలు కరోనా బారినపడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి సైతం మంగళవారం ఇన్ఫెక్షన్ కు గురికాగా, తాజాగా ఆ జాబితాలో అంబటి రాంబాబు కూడా చేరారు.
భారీగా కేసులు.. పెరిగిన మరణాలు..
ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఏపీలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా 6045 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,713కు చేరింది. అందులో 32,127 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా, గడిచిన వారం రోజులుగా ఏపీలో కరోనా మృతుల సంఖ్య భారీగా ఉంటుండటం విషాదకరం. ఒక్కరోజులోనే 65 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మృతుల సంఖ్య 823కు పెరిగింది. ఏపీలో ఇప్పటిదాకా మొత్తం 14.35లక్షల శాంపిల్స్ ను పరీక్ష చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే..
చైనా కు అమెరికా భారీ షాక్.. తొలిసారిగా కాన్సులేట్ మూసివేతకు ఆదేశం.. సీక్రెట్ ఫైల్స్ కాల్చివేత..
ఏపీలో చికిత్సపై నమ్మకం లేదా?
కొవిడ్-19 చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతుండగా, డిప్యూటీ సీఎం మొదలుకొని కరోనాకు గురైన వైసీపీ నేతల్లో ఎక్కువ మంది హైదరాబాద్ లో చికిత్స పొందుతుండటాన్ని ప్రతిపక్ష టీడీపీ ప్రశ్నిస్తున్నది. ఏపీలో చికిత్సపై వైసీపీ నేతలకే నమ్మకం లేకుండా పోయిందని విమర్శించింది. ‘‘అచ్చెన్నాయుడికి ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స చాలన్న సాయిరెడ్డి.. విశాఖ కేజీహెచ్ లోనో ఏపీలోని మరో ఆస్పత్రిలోనో కాకుండా హైదరాబాద్ లో చేరడమేంటి?''అని టీడీపీ నేత బుద్ధా ఎద్దేవా చేశారు. నిజానికి కరోనా నిర్ధారణ అయ్యే సమయానికి సాయిరెడ్డి హైదరాబాద్ లో ఉండటంతో అప్పటికప్పుడు అపోలోలో చేరిపోయారు.