లాక్ డౌన్ నేర్పుతున్న ఆర్ధిక పాఠాలు- బంగారు భవిష్యత్తుకు మార్గదర్శకాలు
భారతీయ చరిత్రలోనే ఆర్ధిక పాఠాలున్నాయి. కౌటిల్యుడి కాలం నుంచే ఆర్ధిక క్రమశిక్షణ అంటే ఏంటో భారతీయులకు తెలుసు. కానీ మారుతున్న కాలంలో పెరిగిన అవసరాలు ఆర్ధిక క్రమశిక్షణ అనే పదాన్ని తేలిగ్గా మార్చేశాయి. పెరిగిన జీతభత్యాలు ఉద్యోగులకు, మార్కెట్ల వృద్ధి వ్యాపారస్తులకు ఆర్ధిక క్రమశిక్షణ విలువను తెలియకుండా చేసేసింది. కానీ మరోసారి కరోనా వైరస్ రూపంలో ఆర్ధిక పాఠాలను భారతీయులు మరోసారి నెమరేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
కరోనా లాక్ డౌన్- ఓ ఆర్ధిక పాఠం...
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా జనం ఇళ్లు దాటి బయటికి రాలేని పరిస్దితి. ఉద్యోగులు, వ్యాపారస్తులు, సాధారణ కూలీలు.... ఇలా ఒక్కరేమిటే అంతా కరోనా బాధితులుగా మారిపోయారు. అదే సమయంలో పని చేయకపోతే కడుపు నిండని వారికి సైతం కరోనా వైరస్ లాక్ డౌన్ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో సహజంగానే ఆర్ధికంగా ఇబ్బందులు తప్పడం లేదు. వ్యాపార సంస్ధలు, ప్రభుత్వాలు, దుకాణాల నిర్వాహకులు అందరూ ఇప్పుడు తమపై పడిన ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు మార్గాలు వెతుకుతున్నాయి. ఇందులో భాగమే జీతాల్లో కోత. అదే సమయంలో ఇళ్లలోనే ఉంటే ఆర్ధికంగా ఎంత జాగ్రత్తగా ఉండొచ్చో వీరందరికీ అర్ధమైంది.
అంతటా పొదుపు మంత్రం..
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఆదాయాల్లో భారీగా కోతపడటంతో వ్యాపార సంస్ధలు, కార్పోరేట్ సామ్రాజ్యాలు, చివరికి ప్రభుత్వాలు సైతం పొదుపు మంత్రాన్ని పఠిస్తున్నాయి. అసలే ఆదాయాలు తగ్గిపోయిన తరుణంలో ఉన్న తక్కువ మొత్తాన్ని అతి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవడంతో పాటు భవిష్యత్తు బావుండాలంటే ఆర్ధికంగా నాలుగు రాళ్లు వెనకేసుకుంటేనే మంచిదనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా పొదుపు మాటే వినిపిస్తోంది. ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దారి అయినా అంతిమంగా పొదుపు మాత్రం తప్పని పరిస్దితిగా మారిపోయింది.
అనవరసర ఖర్చుల్లో భారీగా కోత...
ఖర్చులు తగ్గించుకుంటో ఆటోమేటిగ్గా పొదుపు చేసినట్లే అని పెద్దలు చెబుతుంటారు. మన ఆర్ధిక శాస్త్రాలు, నిపుణులదీ ఇదే మాట. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు జనం సిద్ధమవుతున్నారు. నిన్న మొన్నటివరకూ షాపింగ్ మాల్స్, షికార్లు, సినిమాలు అంటూ తిరిగిన వారంతా కరోనా తర్వాత వాటిని వదులుకునేందుకు మానసికంగా సిద్ధమైపోతున్నారు. ఖర్చులను సాధ్యమైనంత తగ్గించుకోవడం ద్వారా ఆర్ధికంగా బలోపేతం అవ్వాలన్న భావన అందరిలోనూ కనిపిస్తోంది.
ఆదాయ మార్గాలపై దృష్టి...
ఒక్కోసారి ఎంత ఖర్చులు తగ్గించుకున్నా, పొదుపు చేసినా కొత్తగా ఆదాయం లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు కరోనా తెచ్చిన కష్టాలు కూడా దాదాపు అలాంటివే. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు, వ్యాపారాల ద్వారా ఆదాయ రాబడులు తగ్గిపోతున్న తరుణంలో కొత్త ఆదాయ మార్గాలపై జనం అన్వేషణ కొనసాగుతోంది. దీంతో ప్రతీ ఒక్కరూ బహుళ ఆదాయ వనరులపై దృష్టిసారిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గగానే వీటిని అమల్లో పెట్టేందుకు సిద్దమవుతున్నారు. కచ్చితంగా రెండు, మూడు ప్రత్యామ్నాయాలు ఉంటేనే ఆర్ధికంగా స్ధిరంగా ఉన్నట్లు భావించే పరిస్ధితి నెలకొంది.
ఇలా ఏ విధంగా చూసినా అనవసర ఖర్చులను తగ్గించుకుంటూ, పొదుపు మంత్రాన్ని పాటిస్తూ, కొత్త ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టేందుకు అవసరమైన సమయాన్ని, అవకాశాన్ని కరోనా వైరస్ భారతీయులకు అందించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు ఆనందమయంగా మారుతుంది. లేకపోతే ఆర్ధికంగా కుదేలు కాక తప్పదనే పాఠం కరోనా మరోసారి గుర్తు చేస్తోంది.
Recommended Video