మాణిక్యాలరావు కుటుంబానికి మోదీ లేఖ - కరోనాతో మృతి పట్ల ప్రధాని సంతాపం
''మాణిక్యాలరావు చాలా ధైర్యవంతుడైన, చురుకైన నేత. నిరాడంబరంగా జీవిస్తూనే నిత్యం సామాన్యులకు అందుబాటులో ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఆయన అంకితభావంతో పని చేశారు. ఆయన మరణం అందరికీ తీరని లోటు. ఈ కష్ట సమయంలో మీకు భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను..'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ.. దివంగత ఏపీ బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబానికి లేఖ రాశారు.
ఏపీ బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు కరోనాతో పోరాడుతూ గత శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. మాణిక్యాల రావు లేరన్న వార్త విని విషాదానికి లోనయ్యానని లేఖలో పేర్కొన్నారు. ఎదుటివాళ్లకు అభయమిస్తున్నట్లుండే ఆయన రూపాన్ని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని మోదీ వ్యాఖ్యానించారు.
గంటా శ్రీనివాసరావు కు జగన్ నో చెప్పారా? - దొడ్డిదారిన వైసీపీలోకి చేరికంటూ మంత్రి అవంతి సంచలనం
''స్వర్గీయ పైడికొండల మాణిక్యాల రావుకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. కొండలరావు సతీమణి సూర్యకుమారికి ఈ మేరకు ప్రధాని తన సంతాపాన్ని లేఖ ద్వారా పంపారు. ప్రజాహితం కోసం నిబద్ధతతో నిరంతరం పనిచేసిన వ్యక్తిగా మాణిక్యాలరావును మోదీ స్మరించుకున్నారు''అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ ట్వీట్ చేసింది.
చిట్టా విప్పిన విజయసాయిరెడ్డి - షాకింగ్ ఆరోపణలు - 48 గంటల డెడ్ లైన్ పై డెడ్లీ కామెంట్స్
Recommended Video
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన మాణిక్యాలరావు సాధారణ ఫొటోగ్రాఫర్ స్థాయి నుంచి స్వయంకృషితో మంత్రి స్థాయికి ఎదిగారు. చిన్నప్పటి నుంచీ సంఘ్ తో అనుంబంధం కలిగిన ఆయన.. బీజేపీ ఆవిర్భావం నుంచీ పార్టీలో కొనసాగారు. 2014లో తాడేపల్లిగూడెం నుంచే గెలిచి, టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం కిందట కరోనా బారినపడిన ఆయనను కాపాడుకునేందుకు పార్టీ నేతలు తీవ్రంగా శ్రమించారు. విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనకు.. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల బృందం కూడా ట్రీట్మెంట్ ఇచ్చింది. అయితే, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మధుమేహం తీవ్రతరం కావడంతో చివరికాయన శనివారం తుదిశ్వాస విడిచారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.