వ్యాక్సిన్ తీసుకున్నాక మళ్లీ పాజిటివ్ వచ్చిందా ?- తీవ్రత తక్కువే- ఏపీ సర్కార్ క్లారిటీ
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా మరోసారి కరోనా పాజిటివ్ వస్తోందా ? ఏపీలో సోషల్ మీడియా వేదికగా కనిపిస్తున్న పోస్టులపై ఏపీ కోవిడ్ కంట్రోల్ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ల పనితీరుతో పాటు ఓసారి వచ్చిపోయిన వారికి మరోసారి కరోనా వస్తోందంటూ జరుగున్న ప్రచారంపై కోవిడ్ కంట్రోల్ స్పందించింది. ఇందులో ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూనే వివరణ కూడా ఇచ్చింది.
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక పాజిటివ్ వచ్చినా ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని ఏపీ ప్రజలకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత పాజిటివ్ వస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్లను నమ్మొద్దని కోరింది. వ్యాక్సిన్ తీసుకున్నందుకే కోవిడ్ వచ్చిందన్నది వాస్తవం కాదనీ.. వ్యాక్సిన్ తీసుకున్నాక జ్వరం వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది.
కోవాక్సిన్ అనేది ఉత్తేజం లేని వ్యాక్సినే తప్ప శక్తి లేనిది కాదనీ, కోవిషీల్డ్ కూడా వైరల్ వెక్టార్ వ్యాక్సినే కానీ శక్తి లేనిది కాదనీ ఏపీ కోవిడ్ కంట్రోల్ కార్యాలయం వివరణ ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత RTPCR టెస్ట్ లో పాజిటివ్ నిర్ధారణ అయితే వారిలో కోవిడ్ వ్యాధి ఉనికి ఉందని మాత్రమే అర్ధమని తెలిపింది. ఒకవేళ కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినా వ్యాక్సిన్ తీసుకోవడంవల్ల మన శరీరంలో వృద్ధి చెందే యాంటీబాడీస్ కారణంగా వైరస్ నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చని తెలిపింది. వైరస్ బారినపడినా తక్కువ తీవ్రతతో కోలుకోవచ్చని.. పారాసిటమాల్లాంటి మందు బిళ్లలతో చికిత్స పొందవచవచ్చని తెలిపింది.