ప్రత్యేక విమానం వీడి.. రోడ్డు మార్గం పట్టి: కారులో హైదరాబాద్కు చంద్రబాబు: జనతా కర్ఫ్యూకు జై..!
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్.. కొమ్ములు తిరిగిన దేశాధినేతలను సైతం వణికిస్తోంది. పరుగులు పెట్టిస్తోంది. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినా ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తోంది. ఇన్నిరోజులు తన ప్రయాణానికి ప్రత్యేక హెలికాప్టర్ లేదా ప్రత్యేక విమానాన్ని వినియోగిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ భయంతో రోడ్డు మార్గం పట్టారు.
అమరావతి టు హైదరాబాద్.. బై రోడ్
శనివారం అమరావతి ప్రాంతంలోని ఉండవల్లిలో గల తన నివాసం నుంచి చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ రోడ్డు మార్గం గుండా హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. సాధారణంగా వారు ఉండవల్లి నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్తుంటారు. జడ్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబు ఇలా అమరావతి నుంచి హైదరాబాద్కు రోడ్డుమార్గంలో వెళ్లడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ వల్ల పరిస్థితులు భీతావహంగా మారిన నేపథ్యంలో ఆయన విమాన ప్రయాణాన్ని నిరాకరించినట్లు చెబుతున్నారు.
అభిమానుల తాకిడిని నివారించడానికే..
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సి వస్తే.. అక్కడ అభిమానుల తాకిడి అధికంగా ఉంటుందని, వారిని నిరాశకు గురి చేయకుండా కరచాలం చేయాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. చంద్రబాబును స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున అభిమానులు రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రద్దీని నివారించడానికే ఆయన రోడ్డుమార్గంలో హైదరాబాద్కు వెళ్లారని అంటున్నారు.
జనతా కర్ఫ్యూలో చంద్రబాబు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు జనతా కర్ఫ్యూలో పాల్గొనబోతున్నారు. ఆదివారం ఏపీలో దాదాపు కర్ఫ్యూ తరహా వాతావరణం నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ ఎవ్వరూ గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రాలేని పరిస్థితి ఉంటుంది. సందర్శకుల సంఖ్య కూడా బాగా పలచగా కనిపిస్తోంది. దీనితో ఆయన హైదరాబాద్కు వెళ్లడానికి ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు.
రాష్ట్రంలో అన్నీ బంద్..
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండటానికి చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు సహా ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జనతా కర్ఫ్యూలో పాల్గొనడానికి హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. ఇక ఏపీలో పెట్రోల్ బంకులు సహా అన్ని మూతపడబోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ ఆర్టీసీ బస్సులను కూడా నడిపించట్లేదని ప్రజారవాణా శాఖ మంత్రి పేర్నినాని వెల్లడించిన విషయం తెలిసిందే.