ఏపీ గ్రామాల్లో కరోనా వ్యాప్తి- కేసులు తగ్గకపోవడానికి కారణమిదే- పట్టణాలు కోలుకున్నా...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతున్నా ఏపీలో మాత్రం ఇంకా దాదాపు ఏడున్నర వేలకు దగ్గర్లో ప్రతీ రోజూ కేసులు నమోదవుతున్నాయి. గతంలో పోలిస్తే వైరస్ వ్యాప్తి తగ్గాల్సింది పోయి ఇంకా కొనసాగుతుండటం సమస్యగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతుండటం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వందల సంఖ్యలో కొత్త కంటైన్మెంట్ జోన్లు ప్రకటిస్తున్నారు. అయినా పరిస్ధితి అదుపులోకి రావడం లేదు. తొలుత నగరాలు, పట్టణాల్లో ఎక్కువగా కనిపించిన వైరస్ వ్యాప్తి పెరిగిన అవగాహనతో అక్కడ అదుపులోకి వచ్చినా గ్రామాల్లో మాత్రం ఇంకా వైరస్ వ్యాప్తి తగ్గలేదని తెలుస్తోంది.
అఖిలప్రియకు సీఐడీ నోటీసులు-ఎమ్మెల్యేపై కరోనా వ్యాఖ్యలే కారణం- నేడు విచారణ
మిగతా రాష్ట్రాలు కోలుకుంటున్నా...
ఏపీలో ప్రస్తుతం కరోనా కొత్త కేసుల సంఖ్య రోజుకు సగటున 7 నుంచి 8 వేల మధ్య నమోదవుతోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైనా వాటిలో ఎక్కువ శాతం డిశ్చార్జ్ కావడంతో 70 నుంచి 80 వేల మధ్య యాక్టివ్ కేసులున్నాయి. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మాత్రం కరోనా కేసుల సంఖ్య ఇప్పటికీ ఏపీలో ఎక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా చూసినా మహారాష్ట్ర తర్వాత ఏపీ రెండో స్ధానంలో ఉంది. అలాగని కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా ఉన్నాయా అంటే అదీ లేదు. కరోనా పరీక్షల్లోనూ, కేసుల్లోనూ ఏపీ దూసుకుపోతోంది. దీంతో భారీ పరీక్షల నిర్వహణను కూడా ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకోలేని పరిస్దితి ఉంది.
గ్రామాల బాట పట్టిన వైరస్...
కరోనా ఆరంభంలో ఏపీలోని పట్టణాల్లోనే వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. కరోనా భయంతో గ్రామాల్లో ప్రజలు తమంతట తామే ఆంక్షలు విధించుకుని, రాకపోకలను నియంత్రించుకుని ఇళ్ల వద్దే ఉండిపోయారు. దీంతో కరోనా గ్రామాలకు పాకడం కష్టమనే అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత పట్టణాల నుంచి తమ బంధువులు, కుటుంబ సభ్యులే గ్రామాలకు తరలి రావడం, కేంద్రం అన్లాక్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత రవాణా సదుపాయాలు తిరిగి ప్రారంభం కావడం వంటి కారణాలతో అక్కడా వైరస్ పాకడం మొదలైంది. ఇప్పుడు పరిస్ధితి ఏ స్ధాయికి వచ్చేసిందంటే పట్టణాలు, నగరాల్లో అవగాహన పెరిగి కేసులు తగ్గిపోవడం, గ్రామాల్లో ఆ మేరకు కేసులు పెరుగుతుండటం కనిపిస్తోంది. దీంతో రోజువారీ నమోదవుతున్న కేసుల్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న గోదావరితో పాటు మరికొన్ని జిల్లాలే ముందంజలో ఉంటున్నాయి.
అవగాహనే అసలు సమస్య....
పట్టణాల్లో, నగరాల్లో ఉన్న జనానికి కరోనా వైరస్ ప్రభావంపై ఇప్పటికే ఓ అంచనా వచ్చేసింది. కరోనా సోకకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా స్పష్టత వచ్చింది. తగిన ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను ఎలా అదుపు చేయవచ్చో ఇప్పుడు పట్టణ ప్రాంతాలు నిరూపిస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ అవగాహన కరువవుతోంది. అధికారులు రోజువారీ గ్రామాలకు వెళ్లి కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవాగహన కల్పించలేకపోతున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పరిస్ధితి మరీ దారుణంగా కనిపిస్తోంది. ఇక్కడ నిన్న మొన్నటి వరకూ రోజుకు 1400 కేసులకు తక్కువ కాకుండా నమోదయ్యాయి. తాజాగా ఈ సంఖ్య 1100కు చేరడం ఒక్కటే కాస్త ఊరటగా కనిపిస్తోంది.
ప్రధానికీ ఇదే చెప్పిన జగన్...
కరోనా కేసుల్లో తగ్గుదల లేకపోవడానికి కారణాలను నిన్న ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ ప్రస్తావించారు. పట్టణాలు, నగరాల్లో కేసులు తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఉధృతి కొనసాగుతోందని, దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. మిగతా రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా నియంత్రణలోకి వచ్చినా ఏపీలో మాత్రం గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు జగన్ వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోంది. దీంతో రోజువారీ కేసుల సంఖ్యను గ్రామీణ ప్రాంతాల్లో కేసులే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టిసారిస్తే పరిస్ధితి అదుపులోకి తీసుకురావడం కష్టమేమీ కాదని అధికారులు చెబుతున్నారు.
Recommended Video