స్మశానం లో పాతిపెట్టిన లారీ క్లీనర్ శవానికి కరోనా పరీక్షలు- కృష్ణాజిల్లాలో తీవ్ర కలకలం..
కృష్ణాజిల్లాలో అప్రతిహతంగా పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల వ్యవహారంపై అధికారులు సీరియస్ గా దృష్టిపెట్టిన నేపథ్యంలో తాజాగా కొన్ని చిత్ర విచిత్రమైన ఘటనలే ఇందుకు కారణమని తేలింది. ఓవైపు ఇదంతా సాగుతుండగానే జిల్లాలోని చందర్లపాటు మండలం తుర్లపాడులో తాజాగా మృతిచెందిన ఓ లారీ క్లీనర్ శవానికి కరోనా పరీక్షల నిర్వహణ తీవ్ర కలకలం రేపుతోంది.
ఏపీ నుంచి మహారాష్ట్రకు సరుకుల రవాణా కోసం వెళ్లిన ఓ లారీలో క్లీనర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అక్కడే చనిపోయాడు. ఇతను కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన వాడు. మహారాష్ట్రలో ఇతను చనిపోయిన తర్వాత లారీ డ్రైవర్ శవాన్ని అదే లారీలో తుర్లపాడు తీసుకొచ్చాడు. అక్కడే ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు కూడా నిర్వహించాడు. దీంతో ఓ పనైపోయిందని లారీ డ్రైవర్ భావించాడు. కానీ అక్కడే అసలు కథ మొదలైంది.
ఈ తుర్లపాడు గ్రామానికి రావాలంటే రెడ్ జోన్ గా ఉన్న ముప్పాళ్ల గ్రామం దాటి రావాలి. ఇప్పుడు అసలే రెడ్ జోన్లలో రాకపోకలు లేవు. అలాంటిది ముప్పాళ్ల దాటి తుర్లపాడుకు డ్రైవర్ ఆ మృతదేహాన్ని ఎెలా తెచ్చాడు. గ్రామంలో అంత్యక్రియలు ఎలా నిర్వహించాడు. కరోనా సోకినందువల్లే డ్రైవర్ తన క్లీనర్ మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టాడా అన్న అనుమానాలు స్ధానికుల్లో మొదలయ్యాయి. దీంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. రెడ్ జోన్ పరిధిలో ఓ లారీలో శవాన్ని తరలిస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు.
తుర్లపాడు గ్రామస్ధుల అభ్యంతరాల నేపథ్యంలో ఉన్నతాధికారులను సంప్రదించిన స్ధానిక రెవెన్యూ అధికారులు.. మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. శ్మశానంలో పాతిపెట్టిన శవాన్ని వెలికితీసి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు పహారాలో ఈ మొత్తం కార్యక్రమాన్ని ఇవాళ పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. దీంతో జిల్లాలో మరింత భయానక వాతావరణం నెలకొంది.