నెల పొడవునా అవే ఆంక్షలు..జగన్ సర్కార్ కొత్త ఆదేశాలు
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రొటోకాల్, కోవిడ్ మార్గదర్శకాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన కరోనా వైరస్ ప్రొటోకాల్, కోవిడ్ మార్గదర్శకాలను ఈ ఏడాది జనవరి 31వ తేదీవరకు అమలు చేయనుంది. దీనిపై ఓ నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ఏపీ ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రొటోకాల్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ప్రోటోకాల్ అమల్లో ఉంటాయి. అలాగే అన్లాక్ మార్గ దర్శకాలను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చింది. గతంలో జారీ చేసిన కోవిడ్ నిబంధనలు, అన్లాక్ మార్గదర్శకాలు మరో ఏడాది పాటు కొనసాగుతాయని తెలిపింది.
దీని ప్రకారం.. ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులను ధరించాల్సి ఉంటుంది. భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. శుభకార్యాలకు పరిమిత సంఖ్యలో బంధుమిత్రులను ఆహ్వానించడం, ఏదైనా ఉత్సవాలు, ఊరేగింపులను నిర్వహించాల్సి వస్తే.. ముందుగా స్థానిక ప్రభుత్వ అధికారులు, పోలీసులకు తెలియజేయడం, వారి నుంచి అనుమతి తప్పనిసరిగా అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే- ఆలయాలను సందర్శించే భక్తుల వ్యక్తిగత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ కోవిడ్ మార్గదర్శకాలు అమలులోనే ఉంటాయి. కేంద్రం సడలింపులను ఇస్తే.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే అవకాశాలు లేకపోలేదు. కాగా- వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. కొత్తగా 338 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,79,391గా నమోదైంది. ఇందులో 8,69,021 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,108 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,262.