కాల్ మనీ: ఆస్పత్రిలో మాదంశెట్టి శివ దర్జా, కళ్లెం వేసిన సవాంగ్
విజయవాడ: పేరుమోసిన రౌడీషీటర్ మాదంశెట్టి శివకుమార్ ప్రయత్నాలకు విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ చెక్ పెట్టారు. కాల్మనీ కేసులో అరెస్టయి జైలులో రిమాండులో ఉండకుండా అనారోగ్య కారణాలు చూపుతూ పది రోజులకు పైగా ఆస్పత్రిలో దర్జా వెలగబెట్టిన శివకుమార్ డ్రామాకు ఆయన తెర దించారు.
సవాంగ్ ఆదేశాల మేరకు మాదంశెట్టి నాటకాలను డిసిపి కాళిదాసు రంగారావు అడ్డుకున్నారు. కృష్ణలంకకు చెందిన మాదంశెట్టి శివకుమార్ ఓ పేరుమోసిన పాత రౌడీ షీటర్. తన సోదరుని హత్య సాకుగా చూపి గన్మెన్లను పెట్టుకుని వారిని వెంటేసుకు తిరుగుతూ కాల్మనీ వ్యాపారం చేస్తూ జనాన్ని బెదిరించడమే కాకుండా అరాచకాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు.
గన్మెన్లు తొలగించినా కూడా హైకోర్టును ఆశ్రయించి రౌడీషీటు తీయించేసుకుని తిరిగి గన్మెన్లను పొందిన శివకుమార్ యధేచ్ఛగా కాల్మనీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 17వ తేదీన అతన్ని పోలీసులు అరెస్ఠ చేశారు. రిమాండుకు పంపగా మరుసటి రోజే అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ ఆస్పత్రిలో చేరి ఖైదీ వార్డులో ఒక్కడే దర్జా వెలగబెడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.
ఆ విషయం తెలిసి సిపి ఆదేశాలతో రంగంలోకి దిగిన డిసిపి నేరుగా ఆస్పత్రికి తనిఖీ చేయగా కళ్ళు తిరిగే నిజాలు వెలుగు చూశాయి. వెంటనే ఆయన అక్కడ ఉన్న జైలు సెక్యూరిటీ సిబ్బందిని తొలగించి పోలీసు గార్డుల్ని ఏర్పాటు చేశారు. వైద్యులతో మాట్లాడి నివేదిక తీసుకున్న మీదట మంగళవారం శివకుమార్ను డిశ్చార్జి చేయడంతో తిరిగి జైలుకు తరలించారు.