కరోనా కుమ్మేస్తోంది.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలంటూ సీపీఐ కొత్త డిమాండ్..!
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని వాయిదా వేయించడానికి తెలుగుదేశం చేస్తోన్న ప్రయత్నాలకు మరో పార్టీ జత కలిసింది. ఎన్నికలను వాయిదా వేయించడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు కనిపిస్తున్నాయి ఆ పార్టీలు. కరోనా వైరస్ను కూడా వదిలిపెట్టినట్లు కనిపించలేదు. దీన్ని కారణంగా చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
భయానక కరోనా వైరస్ జాడలు ప్రస్తుతం రాష్ట్రంలో పలు చోట్ల కనిపిస్తున్నాయని. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విజ్ఙప్తి చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రమేష్కుమార్కు లేఖ రాశారు. ప్రపంచం మొత్తాన్నీ కరోనా వైరస్ గడగడలాడిస్తోందని, ఏపీలో కూడా కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయని చెప్పారు.
ఒంగోలు, ఏలూరు, విశాఖపట్నం, విజయవాడలలో కరోనా అనుమానిత కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయని, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించడానికి ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం అంత మంచిది కాదని రామకృష్ణ పేర్కొన్నారు. పరిస్థితులు కుదుట పడేంత వరకూ వాయిదా వేయాలని అన్నారు. ఓటు హక్కును కూడా వినియోగించుకోలేని పరిస్థితులు తలెత్తవచ్చని చెప్పారు.
విద్యార్ధులు పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారని, ఎన్నికలు నిర్వహించడం వల్ల అభ్యర్ధుల జనసమీకరణ, ఇంటింటి ప్రచారం, సభలు, సమావేశాలు వంటివి కార్యక్రమాలు విద్యార్థులకు ఇబ్బందులు సృష్టిస్తాయని అభిప్రాయపడ్డారు. ఇంకోవైపు బీసీలకు 10 శాతం రిజర్వేషన్లలో కోత విధించడంతో ఆయా వర్గాలలో గందరగోళం నెలకొందని, దీనిపై పలు బీసీ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయని గుర్తు చేశారు. ఎన్నికలను వాయిదా వేయడమే మంచిదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.