మోడీ పెద్దన్న, బాబు చిన్న తమ్ముడు: జగన్పైనా వామపక్షాల విసుర్లు, ‘జనసేనతోనే..’
విజయవాడ: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలతోపాటు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా వామపక్ష నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం విజయవాడలో శనివారం సీపీఐ, సీపీఎంలు 'మహాగర్జన' పేరిట బహిరంగసభ నిర్వహించాయి. ఈ సభలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి, సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ ప్రసంగించారు.
బీజేపీ, టీడీపీ విమర్శల దాడి
ఈ సభలో సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అమిత్ షా కుమారుడు రూ.50వేల పెట్టుబడితో ఒక్క ఏడాదిలోనే 960 రెట్ల ఆస్తులు పెంచుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో 40వేల కోట్లు దుర్వినియోగమైనట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై మోడీ మాట్లాడటం లేదు? బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. గో సంరక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. వారిలో భయాందోళనలను సృష్టించేందుకు వీడియోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారు' అని మండిపడ్డారు. అంతేకగా, ‘నల్లధనం కూడబెట్టిన శేఖర్రెడ్డి అనే వ్యక్తిని టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమించినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పారా? ఎన్నికలు దగ్గరకు వచ్చినందునే ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. నెలకు రూ.వెయ్యి ఏ మూలకు సరిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. నియోజకవర్గానికి రూ.20 కోట్లు ఖర్చు చేసేందుకు రెండు పార్టీలు సమాయత్తమవుతున్నాయి' అని సురవరం విమర్శలు గుప్పించారు.
మోడీ, బాబూది లాలూచీ రాజకీయం.. జగన్ ఇలా
‘ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులది లాలూచీ కుస్తీ. ఢిల్లీలో మోడీ పెద్దన్నగా.. రాష్ట్రంలో చంద్రబాబు చిన్న తమ్ముడిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసమే వైసీపీ పాదయాత్ర చేస్తోంది. మోడీకి వ్యతిరేకంగా ఆ పార్టీ నేత ఒక్క మాటా మాట్లాడటం లేదు. పెట్రోలు ధరలు పెంచి మోడీ కొత్త రికార్డు సృష్టించారు.. వారికి అభినందనలు' అని బృందా కారత్ విమర్శించారు.
చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్లు కాక ఇంకేమొస్తాయ్!, 25సార్లు సమన్లు..: బాబ్లీ కేసుపై అమిత్ షా
జనసేనతోనే వెళతాం
ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో లంచగొండి, అవినీతి రాజ్యం కొనసాగుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక, మద్యం, కాల్మనీ వ్యాపారాల్లో మునిగితేలుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ప్రభుత్వం కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తుంటే వైసీపీ ప్రశ్నించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో వామపక్షాలు కలిసి వెళతాయన్నారు. ఈ సభలో జనసేన, సీపీఐ(ఎంఎల్), ఫార్వర్డ్బ్లాక్, లోక్సత్తా, ఎంసీపీఐ(యు), ఆమ్ ఆద్మీ, వీసీకే పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
మోడీ, బాబు, జగన్లకు వ్యతిరేకంగా..
ఇది ఇలా ఉంటే, సభకు ముందు ప్రెస్మీట్లో బృందా కారత్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ.. కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల బాటలోనే సాగుతున్నాయని విమర్శించారు. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానంటోన్న చంద్రబాబు నాలుగేళ్లుగా ఏం చేశారని ఆమె నిలదీశారు. ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో చంద్రబాబు, మోడీ ప్రభుత్వాలు, వైసీపీ విధానాలకు వ్యతిరేకంగా ఏపీలో వామపక్షాలు, జనసేన కలిసి పోరాడతాయన్నారు. జాతీయ స్థాయిలో ఎలా వ్యవహరించాలనే దానిపై అక్టోబరులో పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ‘మోడీని గద్దె దించండి.. దేశాన్ని, ప్రజల్ని కాపాడండి' నినాదంతో ముందుకెళ్తామన్నారు కారత్.