'పవన్తో పొత్తుపై మాట్లాడాకే చెప్తున్నాం': పురంధేశ్వరిని ఎన్టీఆర్ కూతురుగా చెప్పుకోవడానికే.. టీడీపీ
విజయవాడ: జనసేనతో పొత్తు విషయమై సీపీఐ రామకృష్ణ మంగళవారం స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుతో వెళ్తామని ఆయన వెల్లడించారు. జనసేనానితో సమావేశమై తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మెరుగైన పాలన కోసం జనసేన, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.
అదే జరిగితే జనసేన కథ ముగిసినట్లే: పవన్కు హెచ్చరిక, తెరవెనుక ఏం జరుగుతోంది?
గత కొన్నాళ్ళుగా జనసేన, వామపక్షాలు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ రెండు వర్గాలు కూడా పరోక్షంగా ఆ సంకేతాలు ఇచ్చాయి. ఈ రోజు రామకృష్ణ పొత్తుపై స్పష్టత ఇచ్చారు. 2019లో టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోవాలని భావిస్తున్నారు.
పురంధేశ్వరిని ఎన్టీఆర్ కూతురుగా చెప్పుకోవడానికి..
టీడీపీ నేత బుద్ధా వెంకన్న మంగళవారం బీజేపీ, వైసీపీ, జనసేనలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు అభివృద్ధిని చూడలేని కభోదులు అన్నారు. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరిని ఎన్టీఆర్ కుమార్తెగా చెప్పుకోవడానికి చింతిస్తున్నామని తీవ్రవ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి ఉంటే ప్రజలకు వివరించాలని చెప్పారు.
Recommended Video
బీజేపీ ఏం చెబితే పవన్ కళ్యాణ్ అదే చేస్తారు
బీజేపీ ఏం చెబితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే చేస్తారని బుద్ధా వెంకన్న ఆరోపించారు. బీజేపీ యాక్షన్ అంటే జనసేనాని ఏపీలో పర్యటనకు బయలుదేరుతారని, అదే బీజేపీ ప్యాకప్ అంటే తిరిగి హైదరాబాద్ వెళ్తారని ఎద్దేవా చేశారు. 2019లో వైసీపీ, బీజేపీ, జనసేనలు చంద్రబాబు గాలికి కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. సీబీఐ కేసులకు భయపడి ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరలేదన్నారు.
జగన్, పవన్లపై సోమిరెడ్డి
కడప జిల్లాను అడ్డం పెట్టుకొని ఎదిగిన వైసీపీ అధినేత వైయస్ జగన్.. ఉక్కు పరిశ్రమ గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం విడ్డూరమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా మండిపడ్డారు. సొంత జిల్లా అభివృద్ధి గురించి కూడా ఆలోచించడం లేదన్నారు. ఉక్కు పరిశ్రమ రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
గాలిని రంగంలోకి దింపింది మోడీ
ఇనుప ఖనిజాన్ని దోచుకుని కోట్లాది రూపాయలను సంపాదించుకున్న గాలి జనార్దన్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దింపారని సోమిరెడ్డి ఆరోపించారు. ఐరన్ ఓర్ను చైనాకు అక్రమ రవాణా చేసిన గాలి జనార్ధన్ రెడ్డి.. ఇప్పుడు తెరపైకి వచ్చి, స్టీల్ ఫ్యాక్టరీ పెడతాననడం విడ్డూరంగా ఉందన్నారు. మరో మంత్రి జవహర్ మాట్లాడుతూ... బీజేపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు దుష్ట చతుష్టయంగా వ్యవహరిస్తున్నాయన్నారు.