ఓటుకు నోటు: 'బాబు రాజీనామా చేయాలి', జగన్ను లాగొద్దన్న ఎమ్మెల్యే
అమరావతి: పార్టీ ఫిరాయింపులు, ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ని ప్రలోభపెట్టిన విషయంలో రేవంత్ రెడ్డితో పాటు సీఎం చంద్రబాబుపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు.
ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదని, రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
బాబును ఏ1గా చేర్చాలి: ఎమ్మెల్యే కోలగట్ల
ఓటుకు నోటు వ్వవహారంలో టీఆర్ఎస్కు, తెలుగుదేశం మధ్య జరుగుతున్న వివాదాల్లోకి వైయస్ జగన్ను లాగొద్దంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. గురువారం ఆయన విలేకురులతో మాట్లాడారు.
ఓటుకు నోటు వ్యవహారం ఇద్దరు సీఎంలు, పార్టీల మధ్య వ్వవహారమే తప్ప రెండు రాష్ట్రాల వివాదం కాదని చెప్పారు. వాస్తవాన్ని ప్రజలకు చెబితే, వైయస్ జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చాలని అన్నారు.