జైల్లో పెడ్తారని జగన్, బాబు భయం: అమరావతిలో సైకిల్పై నారాయణ
అమరావతి: సిపిఐ నేత నారాయణ వ్యవహార శైలే విచిత్రంగా ఉంటుంది. సంప్రదాయ కమ్యూనిస్టు నేతల శైలిని ఆయన బద్దలు కొట్టారు. ఆయన గురువారం ఉదయమే సైకిల్పై అమరావతిలోని సచివాలయానికి వచ్చారు.
ఈ సమయంలో ఎవరూ ఉండరని చెప్పడంతో కాసేపు అక్కడ కూర్చున్నారు. అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్ బాగానే ఉందని మెచ్చుకున్నారు. గురువారం ఆయన మరో ఇద్దరు సీపీఐ నేతలతో కలిసి సైకిల్పై సచివాలయం చూసేందుకు వచ్చారు.
బాగుంందని అంటూనే మెలిక
అమరావతి నిర్మాణంలో చంద్రబాబు ప్లాన్ అయితే బాగుందని, రోడ్లు దీర్ఘకాలికంగా ఉండేలా వేస్తున్నారని, ఆయన ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కాకపోవచ్చునని నారాయణ మీడియా ప్రతినిధులతో అన్నారు.
మోడీ చిరునవ్వు చిందిస్తూ..
ప్రధాని నరేంద్ర మోడీ పైకి చిరునవ్వు చిందిస్తూ మొండి చేయి చూపిస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధానిని నిర్మిచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని ఆయన అన్నారు. అలాగే మట్టి, నీరు ఇస్తే రాజధాని అయిపోతుందా అని ఆయన మోడీని ప్రశ్నించారు. రెండేళ్లుగా ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏమిటని అడిగారు. అమరావతి, పోలవరం నిర్మించాల్సిన భాద్యత కేంద్రానికి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వారు కేసులకు భయపడి
చంద్రబాబునాయడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ కేసులకు భయపడి మోడీని ఏమి అనలేకపోతున్నారని నారాయణ అన్నారు. భయపడి, బతిమలాడితే నిధులు రావని, పోరాడితే లాలూ ప్రసాద్ యాదవ్ లాగా జైల్లో పెడతారేమో అని భయపడుతున్నారని ఆయన అన్నారు. జైలుకి వెళితే ఏమవుతుందని, తర్వాత హీరోలు అవుతారని ఆయన అన్నారు.
లాలూ సత్తా చూపిస్తారని...
లాలూ ప్రసాద్ యాదవ్ని జైల్లో పెట్టారు, 2019లో బీహార్లో ఆయన సత్తా ఏమిటో చూపిస్తాడని నారాయణ అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ సత్తా ఏ పాటిదో మొన్న తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల్లోనే తేలిపోయిందని అన్నారు.
నోటా కన్నా తక్కువ ఓట్లు..
ఆర్కె నగర్లో బిజెపికి నోటా కన్నా తక్కువ ఓట్లు బీజేపీకి రావడంతో మోడీ మరోసారి ఆలోచనలొ పడ్డారని నారాయణ వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు ఒంటరిగా వెళదామని అనుకున్నారని, ఆర్కే నగర్ దెబ్బతో వెనక్కి తగ్గినట్లు ఉన్నారని ఆయన అన్నారు.