కృష్ణా , గోదావరుల అనుసంధానం .. టీఆర్ఎస్ , వైసీపీ సొంత వ్యవహారం కాదన్న సీపీఐ
ఏపిలో వైసిపి పాలనపై సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో సందిగ్ధత నెలకొని నేపథ్యంలో వైయస్ జగన్ దీనిపై క్లారిటీ ఇవ్వాలని, రాజధానిగా అమరావతి కొనసాగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయడానికి రాజధాని సంబంధం లేదని చెప్పిన రామకృష్ణ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలని పేర్కొన్నారు.
యరపతినేని బాటలో చింతమనేని ... కేసుల భయంతో అజ్ఞాతంలోకి ...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించిన జల ఒప్పందాలను లోపాయికారిగా చేసుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఆయన ఇది వైసీపీ, టీఆర్ఎస్ సొంత వ్యవహారం కాదని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్యనదుల అనుసంధానంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఇప్పటికి విత్తన కొరత నెలకొందని, ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా లభించని పరిస్థితి లో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని, విత్తనాల కోసం వెళ్తే రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల్లో మనోధైర్యం నింపేందుకు జగన్ కరువు ప్రాంతాల్లో పర్యటించాలని సిపిఐ నేత రామకృష్ణ సూచించారు. ఆంధ్రాబ్యాంక్ విలీనం చేయడం సరికాదని పేర్కొన్న రామకృష్ణ బ్యాంక్ల విలీనం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని పేర్కొన్నారు. ఆంధ్ర బ్యాంక్ ను ఎందుకు జాతీయీకరణ చేస్తున్నారో కేంద్రంలో పెద్దలకు తెలుసా?అని ప్రశ్నించారు. బ్యాంక్ ఉద్యోగుల ఆందోళనకు సీపీఐ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఏదేమైనా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి ప్రజలలో ఉందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.