ఎంపీల రాజీనామాపై యూ టర్న్: 'మోసగాడు.. జగన్ చేతకానివాడని ముందే తెలుసు'
ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ గురువారం మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
విజయవాడ: ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదని సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ గురువారం మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అలా చెప్పిన తెల్లారే.. పవన్ కళ్యాణ్తో భేటీ: థర్డ్ ఫ్రంట్ కోసమూ
చకోర పక్షిలా ఏడాదిన్నరగా ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి జగన్ ఎదురు చూశాడని ఎద్దేవా చేశారు. తన కేసుల గురించి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టాడని ఆరోపించారు.
జగన్ చేతకాని వాడని తమకు ముందే తెలుసునని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నిక అంశంపై తమకు ఎవరి సలహాలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రజల గుండెల్లో జగన్ మోసగాడుగా మిగిలిపోవడం ఖాయమన్నారు.
రాష్ట్రపతి పదవిపై సూచన
వైయస్ జగన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు స్పష్టమైన మెజార్టీ ఉందని, కాబట్టి ఇలాంటి అత్యున్నత పదవికి పోటీ పెట్టడం సరికాదని హితవు పలికారు. దీనిపై లెఫ్ట్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.
జత కడతామనుకుంటే..
2019 ఎన్నికల్లో.. టిడిపి - బిజెపి జత కలిస్తే పవన్ కళ్యాణ్, లెఫ్ట్ పార్టీలు జగన్ పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలనే యోచన చేసినట్లుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే, హఠాత్తుగా జగన్ యూ టర్న్ తీసుకున్నారు. దీంతో సీపీఐ నేత రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మోసగాడిగా మిగిలిపోతారని తీవ్రంగా విమర్శించారు.
కేసుల కోసమేనని ఆరోపణలు
వైసిపి అధినేత వైయస్ జగన్ కేసుల మాఫీ కోసమే ఇప్పుడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నారని ఇప్పటికే టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మరుసటి రోజే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని శరణు కోరాడంటూ జగన్ పై విమర్శలు గుప్పించారు.
హోదా కోసం రాజీనామా మాటేమిటి?
ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ చెప్పడాన్ని లెఫ్ట్ పార్టీలు సహా అందరూ ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే ఎంపీలతో రాజీనామా చేయిస్తానన్న జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ కాళ్లపై పడ్డారని విమర్శలు చేస్తున్నారు. మరి రాజీనామాలు ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. రాజీనామాల విషయంలోను జగన్ రివర్స్ గేర్ వేస్తారని అంటున్నారు.