చెగువేరా కాదు.. చెంగువీరా.. పవన్ కల్యాణ్పై సీపీఐ నేత ఘాటు విమర్శలు
ఏపీలో రాజకీయ పరిణామాలు తాజా రాజధాని పరిణామాల నేపధ్యంలో శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి దాకా మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, సీపీఐ పార్టీల మధ్య బీజేపీతో జనసేన దోస్తీ నేపధ్యంలో అంతరం ఏర్పడింది. బీజేపీతో జనసేన చేతులు కలపడంతో సీపీఐ షాక్ కు గురైంది. ఇక దీంతో జనసేనకు వామపక్ష పార్టీలు దూరంగా ఉండాలని భావిస్తున్నాటు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పై సీపీఐ నేత రామకృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ పై మండిపడిన సీపీఐ నేత
ఏపీలో జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ముందుకు సాగాలని తీసుకున్న నిర్ణయం ఎవరూ ఊహించని నిర్ణయం. అటు వామపక్ష పార్టీలకు, ఇటు టీడీపీకి అది అసలు డైజెస్ట్ కాని అంశం. ఇక ఈ నేపధ్యంలో నేడు జనసేన బీజేపీల మధ్య పొత్తుకు సంబంధించి కీలక చర్చ జరుగుతుంది. ఇక దీనిపై నిప్పులు చెరుగుతున్న వామపక్ష పార్టీల నేతలు పవన్ పై మండిపడుతున్నాయి. అసలు బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ .
అప్పుడు పాచిపోయిన లడ్లు ఇప్పుడు బందర్ లడ్లు అయ్యాయా ?అని ప్రశ్న
రాష్ట్రానికి పత్యేక హోదా ఇస్తామని చెప్పి పాచిపోయిన లడ్డూలను ఇచ్చిందంటూ బీజేపీని గతంలో విమర్శించిన పవన్ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో నడ్డాను కలిసిన తర్వాత పవన్ కు బందరు లడ్డూలు ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు . ఇప్పటి వరకు జేఎన్యూ ఘటన జరిగిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్తున్న నేతలంతా జేఎన్యూకు వెళ్తున్నారని చెప్పిన రామకృష్ణ కేవలం పవన్ మాత్రమే బీజేపీ ఆఫీసుకు వెళ్లారని పేర్కొన్నారు. కనీసం పవన్ జేఎన్యూ కు కూడా వెళ్లి రాలేదని అసహనం వ్యక్తం చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము పవన్ కు లేదా ? ఆన్న సీపీఐ నేత
గెరిల్లా నాయకుడు చేగువేర తనకు ఆదర్శమని చెప్పుకున్న పవన్ ఇప్పుడు చెంగువీర అయ్యారని ఎద్దేవా చేశారు. బీజేపీ చెంగు పట్టుకుని ముందుకు సాగుతారా అని నిలదీశారు. కేవలం దమ్మున్నవారే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడగలరని పేర్కొన్న సీపీఐ నేత రామకృష్ణ పవన్ కు దమ్ముందో, లేదో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతినే కొనసాగాలని సీపీఐ నేత రామకృష్ణ రాజధాని రైతులకు మద్దతుగా నేడు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నేడు జనసేన , బీజేపీ నేతల భేటీ కొనసాగుతున్న నేపధ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.