'ఉక్కు పరిశ్రమ' పెట్టాలనుకుంటే ఈ దీక్షలెందుకు?:టిడిపి ప్రభుత్వానికి సిపిఎం ప్రశ్న
ప్రకాశం:కడపలో ఉక్కు ఫ్యాక్టరీని పెట్టాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటే అలాంటప్పుడు తమ పార్టీ ఎంపి సిఎం రమేష్తో దీక్ష చేయించడం ఎందుకు? విరమించడం ఎందుకు?... అని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రశ్నించారు.
ఆదివారం ఒంగోలులో జరిగిన విలేకరుల సమావేశంలో బివి రాఘవులు మీడియాతో మాట్లాడారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వమే కడపలో ఉక్కు పరిశ్రమను పెట్టాలనుకుంటే నాలుగేళ్ల క్రితమే కేంద్రానికి ఓ లేఖ రాస్తే సరిపోయేదన్నారు. అప్పుడే కేంద్రం దానికి అనుమతి ఇచ్చేదీ లేనిదీ తేలిపోయేదన్నారు. రాష్ట్రమే ఉక్కు పరిశ్రమ పెట్టాలనుకుంటున్నప్పుడు ఇప్పుడు చేస్తున్న ఆందోళనలు ఏ రాజకీయ ప్రయోజనాల కోసమని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం వాదనలు...తప్పు
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయమై బిజెపి చేస్తున్న వాదనల్లో అసలు వాస్తవాలే లేవని రాఘవులు ధ్వజమెత్తారు. కడపకు సమీపంలో ఇనుప ఖనిజాలు లేవనడం, సముద్రం దగ్గరలో లేదనడం, అనుమతులు ఇవ్వలేమనడం చూస్తుంటే ఈ విషయాన్ని ఏదో రకంగా దాటవేయడానికే కేంద్రం ప్రయత్నిస్తోందని అర్థమవుతోందన్నారు. దేశంలో ఉక్కు పరిశ్రమలు అన్నీ సముద్రాలకు దగ్గరలో ఉన్నాయా?...ఎక్కడో జపాన్లో ఉన్న ఉక్కు పరిశ్రమలకు భారత దేశం నుంచి సముద్రాల ద్వారా ఇనుప ఖనిజాలు వెళ్లడం లేదా?...అని ప్రశ్నించారు. చైనాలో 860 బిలియన్ టన్నులు ఇనుము ఉత్పత్తి ఉంటే మన దేశంలో 100 బిలియన్ టన్నులే ఉందన్నారు. ఈ తరుణంలో చైనాతో పోటీ ఎలా పడతారని కేంద్రాన్ని ప్రశ్నించారు.
అందువల్లే...రాష్ట్రానికి నష్టం
నాలుగు సంవత్సరాల పాటు బిజెపి చేస్తూ వస్తున్న తప్పిదాలను టిడిపి సమర్థిస్తూ రావడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి అన్ని విధాలా నష్టం జరిగిందని బివి రాఘవులు తప్పుబట్టారు. అందువల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వమూ బాధ్యత వహించక తప్పదన్నారు. ఇప్పటికైనా అన్ని విధాలా వెనుకబడిన రాయలసీమకు స్టీలు ఫ్యాక్టరీ వస్తేనే అభివృద్ది చెందుతుందన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి తాము ఆందోళన చేసిన ఫలితంగానే రెండో సొరంగం మంజూరైనా...ఆ ప్రాజెక్టును పూర్తిగా వదిలేశారని రాష్ట్ర ప్రభుత్వంపై రాఘవులు ధ్వజమెత్తారు. పదే పదే కాంటాక్టర్లను మార్చడంతో ఇపుడు ఆ పనులు పూర్తిగా నిలిచిపోయాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాలను అంగీకరించి అన్ని పార్టీలతో కలిసి పోరాడాలని, అలా చేస్తేనే కడప ఉక్కు పరిశ్రమ వస్తుందని గ్రహించాలన్నారు.
జనసేనతో పొత్తు...అభ్యంతరం లేదు
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో సిపిఎం పొత్తు గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ...వామపక్షాలతో కలిసి పనిచేస్తామని జనసేన ఇప్పటికే ప్రకటించినందున ఆ పార్టీతో పొత్తు పరిశీలిస్తామన్నారు. ఇప్పుడు సమస్యలపై పోరాటానికి ప్రస్తుతానికి కలిసి పనిచేయడానికి తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదన్నారు. అయితే ఆగస్టు 15న ఆ పార్టీ తన కార్యక్రమాన్ని ప్రకటిస్తామని చెబుతోందని...దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. తెలుగుదేశం, వైసిపి, బిజెపిలకు వ్యతిరేకంగా పనిచేస్తామని జనసేన చెబుతున్నందున దానితో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగడానికి అభ్యంతరం లేదని రాఘవులు తెలిపారు.
బిజెపి...ఓటమి ఖాయం
దేశంలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా బిజెపి ఓడిపోవడం ఖాయమని బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. అందుకే బిజెపి ఇప్పుడు ఓటమి భయంతోనే రకరకాల గందరగోళాలను సృష్టిస్తోందని ఆరోపించారు. నిన్నటివరకూ కాశ్మీర్లో పాలనను అనుభవించి హఠాత్తుగా బయటకు వచ్చిందన్నారు. అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి వాటిని దేశమంతా రుద్దేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. అయితే బిజెపి ఈ కుట్రలను అడ్డుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు.