లోకేష్ బైక్ పై ర్యాలీలో సీపీఐ నారాయణ...జగన్ పై ఫైర్ .. 31వ రోజుకు చేరిన క్యాపిటల్ వార్
Recommended Video
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని కొనసాగించాలని చేస్తున్న నిరసనలు నేటితో 31వ రోజుకు చేరాయి. ఒక పక్క రాజధాని రైతుల పోరాటం ఉధృతంగా సాగుతుంటే, మరో పక్క హైపవర్ కమిటీ నివేదిక ఇవ్వటానికి సన్నద్ధం అవుతుంది. అందులో భాగంగా నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశం అయ్యింది. ఇక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని 29 రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేస్తున్నారు .
కొనసాగుతున్న రాజధాని రైతుల పోరాటం
ఇక రాజధాని గ్రామాలైన తుళ్ళూరు, వెలగపూడి, మందడం, కృష్ణాయ పాలెంలో రైతులు మహా ధర్నా కొనసాగిస్తున్నారు. సేవ్ అమరావతి అంటూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజధాని అమరావతి కోసం అటు రాజకీయ పార్టీలు కూడా ఆందోళనలు ముమ్మరం చేశాయి. రాజధాని అమరావతికి మద్దతుగా గుంటూరు జిల్లాలో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన బైక్ ర్యాలీలో టీడీపీ నేత నారా లోకేష్, సీపీఐ నేత నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరిలో బైక్ ర్యాలీలో లోకేష్ బైక్ పై నారాయణ
మంగళగిరిలో బైక్ ర్యాలీ నిర్వహించిన నారా లోకేష్ , తన బైక్ పై సీపీఐ నేత నారాయణను ఎక్కించుకుని ర్యాలీ నిర్వహించారు. రాజధాని గ్రామాల రైతులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మంగళగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న లోకేష్ ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని విశాఖ ప్రజలే అంటున్నారని పేర్కొన్నారు. ఆంధ్రుల రాజధానిని మార్చడం ఇది ఐదోసారన్నారు.
వైజాగ్ రాజధాని కావాలని వాళ్ళు అడగలేదన్న లోకేష్
అంతేకాదు రోజారెడ్డి, రామకృష్ణారెడ్డి, బొత్స వంటి వైసీపీ నేతలు రైతులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రకటన వల్ల ఆవేదనతో గుండెలు ఆగి రైతులు చనిపోయారని లోకేష్ మండిపడ్డారు. అయితే రైతులు అనారోగ్యంతో చనిపోయినట్లు చిత్రీకరించాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ2 ముద్దాయి విశాఖలో భూములు కొని ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని లోకేష్ ఆరోపించారు. రాజధాని అమరావతి సాధించేవరకు పోరాటం ఆపమని లోకేష్ తేల్చి చెప్పారు.
మూడు రాజధానుల పేరుతో సీఎం దోపిడీ అన్న నారాయణ
ఇక మంగళగిరి సీతారామ కోవెల నుంచి పాత బస్టాండ్ వరకు లోకేష్ బైక్ పై కూర్చుని ర్యాలీలో పాల్గొన్న నారాయణ ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం అన్ని ప్రాంతాల ప్రజలు పోరాటం చేయాలనిపిలుపు ఇచ్చారు. నాడు సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటిప్రాజెక్టులను ముద్దు పెట్టుకుంటే, సీఎం జగన్ మూడు రాజధానులను ముద్దు పెట్టుకుని దోచుకుంటున్నారని విమర్శించారు. జగన్ తీరుకు నిరసనగా అసెంబ్లీని ముట్టడిస్తామని నారాయణ అన్నారు.