'ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.., ఒక్క సీటు తక్కువైందని అప్పట్లో వాజ్పేయి!'
హైదరాబాద్: కర్ణాటక రాజకీయ పరిణామాలపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. బీజేపీ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటికి 8మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నా గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కేరళలో కేవలం ఒక్క సీటు తక్కువైందన్న కారణంతో ప్రతిపక్షంలో కూర్చున్న చరిత్ర సీపీఐది అని గుర్తుచేశారు. కర్ణాటకలో గవర్నర్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ అన్యాయానికి పాల్పడుతోందని ఇది అత్యంత విచారకరమని అన్నారు. కర్ణాటక ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు.
గతంలో మాజీ ప్రధాని వాజ్పేయి సైతం ఒక్క సీటు తక్కువగా వచ్చినందుకు నైతికతతో వ్యవహరించి ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారని నారాయణ గుర్తుచేశారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ఒక అసెంబ్లీ సీటు తక్కువ వస్తే.. ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు.