"అంతా హైడ్రామా.. ఢిల్లీలో కకార భాష ;హోదా సాధ్యం కాదు"
హైదరాబాద్ : ప్రభుత్వ పనితీరుపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించే సీపీఐ నారాయణ మరోసారి టీడీపీ బీజేపీలపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. హోదా అంశంపై హాట్ హాట్ చర్చ జరుగుతున్న సమయంలో.. దీనిపై స్పందించిన ఆయన ఇదంతా టీడీపీ బీజేపీ చేస్తోన్న హైడ్రామాగా అభివర్ణించారు.
ఒకసారి రాజకీయ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాల్సిందేనని కుంటి సాకులు చెబితే కుదరదని అన్నారు నారాయణ. ప్రత్యేక హోదా అంశం ఏపీ ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నందున హోదా తప్ప మరే ప్యాకేజీని ప్రజలు అంగీకరించబోరని నారాయణ అభిప్రాయపడ్డారు.
ఇక ఢిల్లీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందిస్తూ.. అక్కడంతా కకార భాష నడుస్తోంన్నారు. కకార భాషకు పూర్వంలో వ్యంగ్య పదమైన భాష అన్న అర్థం ఉండేదన్నారు. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ, టీడీపీ నేతలు ఇదే భాష మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు నారాయణ. ఓటర్లను ప్రలోభ పెట్టే తరహాలో ప్రత్యేక హోదాను పక్కనబెట్టి ప్రత్యేక ప్యాకేజీని తెరపైకి తీసుకురావడం ప్రజలను మభ్యపెట్టడం కకార భాష కాక మరేంటని ప్రశ్నించారు నారాయణ. ప్రస్తుతం జరుగుతోందంతా ఢిల్లీలోని ఉన్నత స్థాయి నుంచి జరుగుతోన్న హైడ్రామాగా అభివర్ణించారు.
ప్రత్యేక హోదా అన్న అంశాన్ని మసిపూసి మారేడు కాసే చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ బీజేపీలు ఈ హైడ్రామకు తెరలేపాయన్నారు నారాయణ. 'పెట్టలేని అమ్మ ఇది ఎంగిలి' అన్నట్టు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం పట్ల సుముఖంగా లేని బీజేపీ ఇది ఎంగిలి అని చెప్పి ఏపీని ఎగతాళి చేస్తుందని నారాయణ విమర్శించారు.
ఏ రాష్ట్రానికి ఇక హోదా సాధ్యమయ్యే పని కాదు :
హోదా అంశంపై స్పందించిన ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ.. 'ఇక నుంచి దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు'. హోదాతో వచ్చే ప్రయోజనాల కంటే అంతకుమించిన నిధులను కేంద్రం ఏపీకి ఇస్తుందని కన్నా చెప్పారు.
హోదా అంశంపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ హోదాపై స్పందించారు కన్నా లక్ష్మీ నారాయణ. ఏపీలోని ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలను కేంద్రానికి అందిస్తే అందుకు తగట్టు నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఏపీకి రూ. 1.40 లక్షల కోట్ల ఆర్థిక సహాయం అందినట్లుగా తెలియజేశారు కన్నా.