"పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రామాయణంలో పిడకల వేటలా ఉన్నాయి.."
పవన్ వ్యాఖ్యలు రామాయణంలో పిడకల వేటలా ఉన్నాయని సీపీఐ నారాయణ విమర్శించారు.
హైదరాబాద్: జల్లికట్టు స్పూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రగిలించాలని పవన్ చేసిన ప్రయత్నాలన్ని ట్విట్టర్ కే పరిమితమవడం పట్ల ఆయనపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆర్కే బీచ్ లో యువత తలపెట్టిన మౌనదీక్షకు పవన్ హాజరవుతారని భావించనివారంతా.. ఆయన తీరు పట్ల నిరుత్సాహపడ్డారు.
ఆ తర్వాతైనా.. హోదా ఉద్యమాన్ని సీరియస్గా ముందుకు తీసుకెళ్తారనుకుంటే.. దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవ సభ పేరిట.. ఆయన మరో అంశాన్ని ముందుకేసుకోవడం.. చాలామంది దృష్టిలో విషయాన్ని తప్పుదోవ పట్టించినట్టయింది.
తాజాగా ఇదే విషయాన్ని సీపీఐ నారాయణ కూడా స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవ పేరిట పవన్ సభకు సిద్దమవడాన్ని.. హోదా అంశాన్ని పక్కదోవ పట్టించడమేనని ఆయన అన్నారు. ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తే.. ఉద్యమాలు పుట్టుకొస్తాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు.
పవన్ వ్యాఖ్యలు రామాయణంలో పిడకల వేటలా ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజా సమస్యలు పక్కదారి పడుతాయన్నారు. ప్రజలను మోసగించడంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులను మించినవారెవరు లేరన్నారు.