'వెంకయ్య నోటిని ఫినాయిల్తో కడగాలి': నారాయణకు ఎందుకంత మంట
అమరావతి: ప్రత్యేకహోదాపై అబద్ధాలు చెబుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి నోటిని ఫినాయిల్తో కడగాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ విజయవాడలోని మొగల్రాజుపురం స్థానిక నిమ్మతోట సెంటర్లో సీపీఐ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు.
ఈ ప్రజాబ్యాలెట్ కార్యక్రమానికి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి హోదాపై వెంకయ్య అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పార్లమెంట్లో జీఎస్టీ బిల్లును ఏ విధంగానైతే ఆమోదింప చేసుకున్నారో, అందులో నాల్గోవంతైన కష్టపడి ఉంటే ఏపీకి హోదా వచ్చి ఉండేదన్నారు.
పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేకహోదా కావాలని కోరిన వెంకయ్య, అధికారంలోకి వచ్చాక మాట మార్చి ప్యాకేజీ అంటూ సన్మానాలు చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఏపీకి హోదా రాకుండా అడ్డుకోవడానికి కారణం ఈ రాష్ట్రం అభివృద్ధి కాకుండా ఆపాలనే అన్నారు. తద్వారా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని, టీడీపీ బలహీన పడుతుందని నిస్వార్ధ బుద్ధితోనే అని చెప్పారు.
వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడిని బకరాల్లాగా ప్రధాని మోడీ ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. 2019 వచ్చే నాటికి వీళ్లిద్దరి పని పట్టిస్తాడని అన్నారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ లాంటి వారిని అణదొక్కిన మోడీకి చంద్రబాబు, వెంకయ్య ఒక లెక్కకాదని చెప్పుకొచ్చారు.
ఇరత రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం వల్లే హోదా ఇవ్వడం లేదని చెబుతున్న వెంకయ్య, ప్రధాని మోడీతో కలిసి జీఎస్టీ బిల్లును ఎలా ఆమోదింపజేసుకున్నారని ప్రశ్నించారు. ప్యాకేజీలో భాగంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినవి కాకుండా అదనంగా మరో రూ.2.25 లక్షల కోట్లు ఇస్తే ప్రజలందరూ సంతోషిస్తారని అన్నారు.