అందుకే బీజేపీని వీడా, బాబే సమర్థుడు: రఘురామ కృష్ణంరాజు, నాలుక చీరుస్తామన్న సీపీఐ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ అనుకున్నంత స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయడం లేదని తాజాగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న రఘురామ కృష్ణంరాజు అన్నారు. బీజేపీలో ఉండి ప్రత్యేక హోదా సాధించడం కష్టమనే తాను టీడీపీలోకి చేరినట్లు తెలిపారు.
శనివారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ.. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. ఏపీ అభివృద్ధి కోరుకునే ప్రతీ ఒక్కరూ చంద్రబాబుతో కలిసి రావాలని అన్నారు.
మాటలే కాదు చేతల్లోనూ చంద్రబాబు పనితనం కనిపించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. రాష్ట్రంలో వృద్ధిరేటు దేశం కంటే మెరుగ్గా ఉందన్నారు. దేశంలోని నెంబర్ వన్ స్థానానికి ఏపీ ఎదుగుతుందని ఆయన అన్నారు.
లాలూచీ రాజకీయాలు, నాలుక కోస్తాం: రామకృష్ణ హెచ్చరిక
తెలుగుదేశం పార్టీలో చేరిన రఘురామ కృష్ణంరాజు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కారల్ మార్క్స్ 200వ జయంతి సందర్భంగా వామపక్ష నేతలు విజయవాడలో నివాళులర్పించారు. ఏపీ సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ కారల్ మార్క్స్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటనించారు.
అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించేందుకు మే 8న అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ప్రధాని మోడీ ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇక, స్వాతంత్ర్య సమరయోధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని పోల్చినందుకు రఘురామ కృష్ణంరాజు నాలుక చీరేస్తామని హెచ్చరించారు. స్వాతంత్ర్య సమరయోధుల కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోరని, ఇలా అవాకులు చెవాకులు పేలుతూ స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.