వైసీపీ, బీజేపీ కలిసిపోయాయా?.. ఆ రహస్యమేంటో బయటపెట్టాలి: సీపీఐ రామకృష్ణ
విజయవాడ: ఎవరైనా తమ పార్టీ గెలుస్తుందని చెప్పుకుంటారు గానీ.. విష్ణుకుమార్ రాజు మాత్రం ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్ట అన్నారు.
కర్ణాటక ఎన్నికల్లొ గాలి సోదరులకు టిక్కెట్లు ఇచ్చినట్టు.. ఇక్కడ కూడా వైసీపీ, బీజేపీ కలిసిపోయాయా? అని ఆయన ప్రశ్నించారు. దీని వెనుకున్న రహస్య ఒప్పందాలను బీజేపీ, వైసీపీ నాయకులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా విషయంలో ఏనాడు ప్రధాని మోడీని జగన్ పల్లెత్తు మాట అనలేదని, అదే సమయంలో చంద్రబాబును మాత్రం టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వీటి ద్వారా జగన్ ప్రజలకు ఎలాంటి సంకేతాలిస్తున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. వైసీపీ గురించి ఆ పార్టీ నాయకుల కంటే ఎక్కువగా బీజేపీ నాయకులే ప్రశంసిస్తున్నారని, ఇవన్నీ దిగజారుడు రాజకీయాలేనని అన్నారు.
ఓవైపు అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా అని చెబుతున్న మోడీ.. మరోవైపు మరోవైపు కర్ణాటకలో మైనింగ్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి వర్గానికి ఎలా టికెట్లు కేటాయించారని ప్రశ్నించారు. ఇది అవినీతిపరులకు కొమ్ముకాయడమే అన్నారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపికి బుద్ది చెబుతారని రామకృష్ణ అన్నారు. మే 8న విభజన హామిల సాధనా సమితి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.