చింతమనేనిని చూసి భయపడుతున్న సిఎం చంద్రబాబు...అరెస్ట్ చేయాల్సిందే:సిపిఐ రామకృష్ణ
విజయవాడ:దెందులూరు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలు పెచ్చుమీరిపోయాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. చింతమనేనిని చూసి సిఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని...ఆయనకు చట్టాలు వర్తించవా అని రామకృష్ణ ప్రశ్నించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చింతమనేనిని వెంటనే అరెస్టు చెయ్యాలని, లేకపోతే అమరావతిలో ఆందోళన చేస్తామని రామకృష్ణ డిమాండ్ చేశారు. వారం రోజులకుపైగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని సిపిఐ రామకృష్ణ నిలదీశారు. కార్మికుల సమ్మెలను టిడిపి ప్రభుత్వం పోలీసులతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో కరువు కారణంగా రైతులు అప్పులతో విలవిల్లాడిపోతున్నారని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 29వ తేదీన అనంతపురంలో కరువుపై కవాతు నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. అగ్రిగోల్డ్ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. నాలుగేళ్లు అయినా ఇప్పటివరకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేదన్నారు.
ఇదిలావుంటే మరోవైపు టిట్లీ తుఫాను బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయాన్ని ప్రకటించింది. పంట నష్టానికి వరికి హెక్టారుకు ఇరవై వేలు రూపాయలు...జీడి మామిడికీ హెక్టారుకు ఇరవై ఐదు వేలు...కొబ్బరి తోటకు రూ. 1200...జీడి, కొబ్బరి పంటకు మూడు సంవత్సరాలకు నిర్వహణ ఖర్చుగా రూ. 40 వేలు భీమా ఇప్పిస్తామని తెలిపింది. బోటు కోల్పోయిన మత్స్యకారులకు రూ. 2 లక్షలు...సబ్సిడీ లక్ష రూపాయలు...పూర్తిగా ధ్వంసమైన మోటారు బోట్లకు రూ. 6 లక్షలు...వలలు పూర్తిగా కోల్పోయిన వారికి రూ.10 వేలు సాయం ప్రకటించింది.
ఆక్వాకల్చర్ కు హెక్టారుకు రూ. 30 వేలు...చనిపోయిన ఆవులు, గేదెలకు రూ. 30 వేలు. తీవ్రంగా గాయపడి చనిపోయే స్థితిలో ఉన్న మేకలు, గొర్రెలకు మూడు వేలు చొప్పున చెల్లించనున్నట్లు వెల్లడించింది. పశువుల శాలలు నిర్మాణానికి, రెండు పశువులకు లక్ష రూపాయలు...మూడు పశువులు ఉంటే రూ. 1.50 లక్షలు. నాలుగు పశువులకు రూ. 2 లక్షలు...అలాగే పూర్తిగా నష్టపోయిన గృహాలకు రూ. 10 వేలు...రేకుల ఇళ్లకు అవసరమైనన్ని రేకులు...ధ్వంసమైన దుకాణాలకు రూ. 10 వేలు...రేషన్ దుకాణాల నుండి బయోమెట్రిక్ అవసరం లేకుండా తెల్లకార్డుల వారికి 25 కిలోలు, వేటకు వెళ్ళే మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, ఇతర సరుకులు ఇస్తామని తెలిపింది.