2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లును టిడిపి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి:సిపిఎం మధు డిమాండ్
అమరావతి:చంద్రబాబు ప్రభుత్వం చేసిన 2013 భూసేకరణ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.బుధవారం ఆయన రాజధాని పరిధిలోనితాడేపల్లి మండలం ఉండవల్లి రైతులతో సమావేశం అయ్యారు.రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలన్నారు.అన్యాయం జరిగితే ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా అంటూ టిడిపి ప్రభుత్వంపై మధు మండిపడ్డారు.రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే సవరణలను వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.పార్లమెంటులో ఆమోదించిన 2013 భూసేకరణ చట్టానికి నవంబర్ 20, 2014 లో రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ తయారు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా
2013 భూసేకరణ చట్టం రైతులకు కల్పించిన హక్కులను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సిపిఎం మధు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన సవరణ చట్టం 2014 జనవరి 1 నుండి అమలులోకి వస్తుందని ప్రకటించడం అంటే రైతుల భూముల్ని బలవంతంగా గుంజుకోవడమేనన్నారు. నిరంతరం పారదర్శకత, రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడే తెలుగుదేశం ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం ద్వారా రైతులకు కల్పించిన హక్కులను నిర్వీర్యం చేసిందన్నారు.
బిజెపి రైతుల భూములను గుంజుకోడానికి చేసిన పనినే నేడు టిడిపి చేసిందని, బహుళ పంటలు పండే భూములను భూ సేకరణలో మినహాయించడం, రైతుల అంగీకారం తప్పనిసరిగా తీసుకోవడం వంటి సవరణలతో రైతులను దగా చేయడానికి అవకాశం కల్పించారన్నారు.భూసేకరణ చట్టం సవరణ పై టిడిపి ప్రభుత్వం పై యుద్ధం చేస్తామని...రైతులకు సిపిఎం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.స్థానిక సంస్థల హక్కులను సైతం కాలరాస్తూ పంచాయతీ, మున్సిపాల్టీల ఆమోదం కూడా అవసరం లేదంటూ సవరణలు తెచ్చి ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీసిందని అన్నారు. నిర్వాసితుల హక్కుల్ని నిరంకుశంగా కాలరాస్తూ ఏకమొత్తంగా కొంత సొమ్ము ముట్టజెప్పి చేతులు దులుపుకోడానికి చూడడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలకు నిదర్శనమన్నారు.రైతులకు హానికరమైనచాలా ప్రమాదకరమైన భూసేకరణ చట్టాన్ని టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం చేసిన చట్టం వల్ల ఎవరైనా కోర్టుకు వెళ్లి నా ఎటువంటి ఉపయోగం ఉండదని...అలాంటి ప్రమాదరకరమైన భూసేకరణ చట్టం బిల్లునుఅసెంబ్లీలో ప్రతిపక్షం లేని సమయంలో టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టారని ధ్వజమెత్తారు. ఈ విధంగా చేయడం చాలా మోసపూరిత చర్య అని దుయ్యబట్టారు.